ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్: డీజీపీకి కేటీఆర్ ట్వీట్, అనురాగ్ చర్యలు, థ్యాంక్స్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా డీజీపీ అనురాగ్ శర్మను ప్రశ్నించారు. దీంతో వెంటనే సంబంధిత అంశం పైన డిజిపి చర్యలు తీసుకున్నారు.
ఈ సంఘటన సోమవారం నాడు జరిగింది. రంగారెడ్డి జిల్లా మంచాల ఇన్స్పెక్టర్ గంగాధర్ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యారు. రెండు రోజుల కిందట ఇండియన్ నేషనల్ ర్యాలీ సంస్థ చేపట్టిన బైక్ ర్యాలీని అనుమతి లేదంటూ గంగాధర్ అడ్డుకుని వారిపై చేయి చేసుకున్నారు.
ఈ విషయాన్ని నిర్వాహకులు కెటిఆర్ దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ వ్యవహారంపై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఫెండ్రీ పోలీస్ విధానంపై డిజిపిని ప్రశ్నించారు.
కెటిఆర్ ట్వీట్ పైన డిజిపి వెంటనే స్పందించారు. సదరు ఇన్స్పెక్టర్ పైన చర్యలు తీసుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. డిజిపి ఆదేశాల మేరకు రాచకొండ కమిషనర్.. మంచాల ఇన్స్పెక్టర్ పైన క్రమశిక్షణలకు ఉపక్రమించారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన డీజీపీకి.. మంత్రి కృతజ్ఞతలు తెలపడం విశేషం. డిజిపికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.