చంద్రబాబు గురించి నేను చెప్పను, ఆయన చెప్పిందే: కేటీఆర్ దిమ్మతిరిగే షాక్
Recommended Video
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీని కలవడంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి (ఆపద్ధర్మ) కల్వకుంట్ల తారక రామారావు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు.
ఆసక్తికరం: రాజాసింగ్ కార్యాలయానికి కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్, ఎందుకంటే?
చంద్రబాబుపై ట్వీట్
గతంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన ట్వీట్లను పోస్ట్ చేశారు. అవినీతి కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయడమే తమ లక్ష్యమని, ఇందుకోసం తాము ఎవరితోనైనా కలిసేందుకు సిద్ధమని, 1983 రిపీట్ అవుతుందని, కాంగ్రెస్ పార్టీని లేకుండా తెలుగుదేశం పార్టీయే చేస్తుందని మరో ట్వీట్లో చంద్రబాబు పేర్కొన్నారు.
సోనియా గాంధీని ఏమన్నారంటే?
యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధామంత్రిగా చేసేందుకు దేశాన్ని ముక్కలు చేస్తున్నారని మరో ట్వీట్లో చంద్రబాబు పేర్కొన్నారు. 2014లో ఎన్డీయే గెలిచిన అనంతరం కూడా చంద్రబాబు చేసిన ట్వీట్ను కేటీఆర్ పొందుపర్చారు. అవినీతి, అరాచక కాంగ్రెస్ పార్టీ పాలనను భారత ప్రజలు తిరస్కరించారని, ఎన్డీయేను విశ్వసించినందుకు ప్రజలకు ధన్యవాదాలు అని చంద్రబాబు ఓ ట్వీట్ చేశారు.
చంద్రబాబు గురించి నో కామెంట్, ఇదే తెలియజేస్తోంది
కేటీఆర్ ట్వీట్ పైన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆయన పైన విమర్శలు చేస్తుండగా, మరికొందరు ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఈ ట్వీట్ చేసిన కేటీఆర్.. చంద్రబాబు గారు గురించి నో కామెంట్ అని, గతంలో ఆయన చెప్పిందే తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
సిరిసిల్ల జిల్లాలో
ఇదిలా ఉండగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పద్మశాలి వస్త్ర పరిశ్రమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కృతజ్ఞత సభలో కేటీఆర్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాకూటమిపై నిప్పులు చెరిగారు. ఎటువంటి శిక్షణ తరగతులు లేకుండానే నేతన్నలు అద్భుతమైన వస్త్రాలను తయారు చేస్తారని, అందుకే వారిని చేనేత కార్మికులు అని కాకుండా కళాకారులు అని పిలవాలని అన్నారు. పద్మశాలీలు తమపై చూపిస్తున్న అభిమానాన్ని జీవితాంతం మరిచిపోలేనన్నారు. సిరిసిల్ల బతుకమ్మ చీరలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలు అందరూ గర్వంగా తమ గుండెలకు అత్తుకుంటున్నారని చెప్పారు. నేతన్నలను కేసీఆర్ ఆదుకునేందుకు చర్యలు చేపట్టారన్నారు. మహా కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలను చంద్రబాబు బతకనిస్తాడా అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణకు సాగు, తాగునీరు రాకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు రైతన్నలు, నేతన్నలు, గీతన్నల తలరాతను మార్చే ఎన్నికలు అని చెప్పారు. తెలంగాణలో మళ్లీ తెరాస ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేస్తే పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. తాము మద్దతు తెలిపిన వ్యక్తే రేపు కాబోయే ప్రధానమంత్రి అవుతారని చెప్పారు.