ఏపీ మూడు రాజధానులపై మంత్రి కేటీఆర్: జగన్ పాలనపై సహా ట్విట్టర్ వేదికపై ఆసక్తిర సమాధానాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మూడు రాజధానుల ఏపీ సర్కారు ప్రతిపాదనను రాయలసీమ, ఉత్తరాంధ్రకు చెందిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, కొందరు రాజకీయ నాయకులు స్వాగతిస్తుండగా.. రాజధాని అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ మూడు రాజధానుల అంశంపై తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆదివారం ఆయన #askktr పేరుతో ట్విట్టర్ వేదికగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే ఆయనకు ఓ నెటిజన్ మూడు రాజధానుల విషయంపై స్పందించాలని కోరారు.
మూడు రాజధానులపై కేటీఆర్.. జగన్ పాలనపై ఇలా..
‘మీరు తెలంగాణకు చెందినవారన్న సంగతి ఒక్క క్షణం మర్చిపోండి. ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు ఏర్పాటు చేయడంపై మీ అభిప్రాయం ఏంటీ? రాజధాని నగరం, హైకోర్టు ఇవేనా అభివృద్ధి అంటే?' అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ తెలివైన సమాధానమిచ్చారు. మూడు రాజధానుల అంశంపై నిర్ణయించేది తాను కాదని, ఏపీ ప్రజలేనని స్పష్టం చేశారు. ఏపీ సీఎం జగన్ పాలనపై ఒక్క మాటలో చెప్పాలని ఓ నెటిజన్ కోరడంతో.. జగన్ పాలన బాగుందని చెప్పారు. బాగుందనే తాను భావిస్తున్నట్లు తెలిపారు.
ఇంకెవరు కేసీఆరే..
ప్రస్తుత రాజకీయాల్లో మీకు స్పూర్తి ఎవరు? అని ఓ నెటిజన్ ప్రశ్నకు సమాధానంగా.. మరో ఆలోచన లేదు.. కేసీఆర్ అంటూ కేటీఆర్ సమాధానమిచ్చారు. మీలాగా మిగిలిన మంత్రులు కూడా సోషల్ మీడియా వేదికగా చురుగ్గా పాల్గొనే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. ఇప్పటికే చాలా మంది ఉన్నారని చెప్పారు.
అదే మనకు సవాల్..
అంతర్జాతీయ స్థాయి మ్యానుఫాక్చరింగ్ కంపెనీలను హైదరాబాద్/తెలంగాణకు తీసుకొస్తున్నారా? అని ప్రశ్నించగా.. ఇప్పటికే అందుకోసం కృషి చేస్తున్నాం బ్రదర్. ఇప్పటికే కొన్ని ఉన్నాయి. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, ప్రాసెసింగ్ కంపెనీలు రావాలని తెలిపారు. ఆర్థిక సంక్షోభం, కులం/మత రాజకీయాలు, పేదరికం ఏది భారత్కు అసలైన సవాల్? అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా.. రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థను బ్యాలెన్స్ చేయడం సవాల్ అని కేటీఆర్ చెప్పారు. హాట్స్టార్లో తాను బిలియన్స్ అనే సిరీస్ చూసినట్లుగా కేటీఆర్ ఓ నెటిజన్ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
సీఏఏను అమలు చేస్తారా? అంటే..
పార్లమెంటులో సీఏఏకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ ఓటు వేసింది.. కానీ, ఇప్పుడు సీఏఏ చట్టంగా మారింది.. తెలంగాణలో సీఏఏను అమలు చేస్తారా? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ముఖ్యమంత్రి, కేబినెట్ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని మంత్రికేటీఆర్ తెలిపారు. మీ రాజకీయ ప్రవేశానికి ఏది స్ఫూర్తి అంటే.. తెలంగాణ ఉద్యమమేనని చెప్పారు.
ఐటీ, అభివృద్ధిపై ఏమన్నారంటే..
కొంపల్లి ప్రాంతంలో ఐటీ పార్క్ ఎప్పుడు ఏర్పాటవుతుందని అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ.. భూసేకరణ జరుగుతోందని మంత్రి తెలిపారు. ఏయే రంగాలపై అధికంగా ఖర్చు చేస్తున్నారనే ప్రశ్నకు.. ఆరోగ్యం, విద్యా, గ్రామీణ, పట్టణ మౌళిక సదుపాయాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్లో ఫార్మాసిటీని ఎప్పుడు ప్రారంభిస్తారని అనగా.. వచ్చే ఏడాది తప్పకుండా జరుగుతుందన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టును భారత ప్రభుత్వం స్క్రాప్ చేసిందని.. కానీ, తాము ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.
అలాంటి వ్యక్తిని చూడలేదు..
రాజకీయాల్లో బిజీగా ఉండే మీరు.. వ్యక్తిగత జీవితాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు. ఇది ఉద్యోగం చేస్తున్న చాలా మందికి కష్టంగా మారింది. ఇటు ఉద్యోగాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోలేక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దీనికి మీ సమాధానం అని అడగ్గా.. తాను కూడా తన వ్యక్తిగతం కోసం వెతుకుతున్నానని.. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసే వ్యక్తి తనకు కూడా దొరకలేదని అన్నారు.
31 పార్టీకి రమ్మంటూ ఆహ్వానంపై..
కాగా, మరో నెటిజన్ డిసెంబర్ 31కి పార్టీ చేసుకుందామంటూ కేటీఆర్ను ఆహ్వానించారు. పని ఒత్తిడి కూడా దూరమవుతుందని అన్నాడు. తనకు ఒత్తిడి లేదని పార్టీకి రానని చెప్పొద్దని కూడా వ్యాఖ్యానించాడు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. పార్టీకి పిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు.