‘చిరంజీవి’ని జపాన్లో చూసి కేటీఆర్ షాక్: రాజ్దీప్కు ఆసక్తికర రిప్లై(పిక్చర్స్)
Recommended Video
హైదరాబాద్/టోక్యో: జపాన్ దేశ పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఓ ఫొటోను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. జపాన్లోని షిజ్వోకా ప్రాంతంలోని హమామట్సు అనే చిన్న పట్టణంలో ఉన్న సుజుకి మ్యూజియంను కేటీఆర్ శుక్రవారం సందర్శించారు.
అయితే ఆ మ్యూజియంలో మెగాస్టార్ చిరంజీవి ఫొటోను చూసి కేటీఆర్ ఆశ్చర్యపోయారట. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ ఫొటోలు పోస్ట్ చేశారు.
చిరును చూసి ఆశ్చర్యపోయా
‘సుజుకి మ్యూజియంను సందర్శించాను. ఈ పర్యటన చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ ఎవరి ఫొటో చూశానో ఊహించగలరా? మన మెగాస్టార్ చిరంజీవి. మన మాతృభూమికి చెందిన వారి ఫొటోను హమామట్సులాంటి చిన్నపట్టణంలో చూడటం గర్వంగా అనిపించింది' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
పారిశ్రామికవేత్తలతో చర్చలు
కాగా, జపాన్ పర్యటన సందర్భంగా టోక్యోలోని హమామట్సూలో సకురాయ్ లిమిటెడ్ కంపెనీ సీఈవో షిగెరు ఐసోబేను మంత్రి కేటీఆర్ బృందం కలిసింది. అనంతరం హమామట్సూలోనే స్టాన్లీ ఎలక్ట్రిక్ కంపెనీ లిమిటెడ్ సీఈవో యోషిత్సుగు మత్సుషితాతో సమావేశమైంది. పారిశ్రామిక అనుకూల రాష్ట్రం తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అంశంపై వారితో మంత్రి బృందం చర్చించింది.
హైదరాబాద్పై రాజ్దీప్ సర్దేశాయ్ ఆసక్తికర ట్వీట్
ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ హైదరాబాద్ను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ పెట్టారు. ‘ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఢిల్లీకంటే హైదరాబాదే మెరుగైన రాజధాని లేదా రెండో రాజధాని అయ్యి ఉంటే బాగుండు అనిపిస్తుంది. భారత్కు రెండు రాజధానులు ఉండాల్సింది' అని రాజ్దీప్ ట్వీట్ చేశారు. కాగా, రాజ్దీప్ శుక్రవారం హైదరాబాద్లోని పార్క్ హయత్లో ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్ 2018 పేరిట తెలంగాణ సీఎం కేసీఆర్తో ముఖాముఖి నిర్వహించారు.
భారత్కు ఎప్పటికీ రెండో రాజధాని హైదరాబాద్
కాగా, రాజ్దీప్ ట్వీట్ను చూసిన కేటీఆర్ వెంటనే స్పందించారు. ‘రాజ్దీప్.. దేశ రాజధాని ఢిల్లీ తరువాత రాష్ట్రపతి నిలయం ఉన్న హైదరాబాద్ అన్న విషయం మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఏటా శీతకాలంలో రాష్ట్రపతి ఈ నిలయంలో బస చేస్తుంటారు. హైదరాబాద్ భారత్కు రెండో రాజధానే. కాకపోతే అధికారికంగా ధృవీకరించలేదంతే..' అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.