కేటీఆర్ అద్యక్షతన తొలి కార్యవర్గ సమావేశం..! పార్టీ బలోపేతం పై కార్యాచరణ..!
హైదరాబాద్: ఆయన బాద్యతలు చేపట్టి 24 గంటలు ఇంకా పూర్తికాలేదు. అప్పుడే పని మొదలు పెట్టారు. నూతన కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అధ్యక్షతన తొలిసారి తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశమయ్యింది. తెలంగాణ భవన్ లో జరుగుతున్న ఈ సమావేశంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అద్భుత విజయం సాధించడంలో కేటీఆర్ పాత్రను పార్టీ కార్యవర్గం కొనియాడింది. ప్రధానంగా ఈ సమావేశంలో క్షేత్రస్ధాయిలో పార్టీ పటిష్టతకు తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. పార్టీ సంస్ధాగత నిర్మాణం పకడ్బందీగా చేయాలనే చర్చ జరిగింది. పార్టీ కార్యవర్గాలను కొత్త జిల్లాల ప్రాతిపదికన పార్టీ కమిటీలు వేయాలా లేక కొంత కాలం పాత జిల్లాల లెక్కనే కొనసాగిద్దామా అనే చర్చ కూడా జరిగినట్టు తెలుస్తోంది.
అంతే కాకుండా పార్టీ అనుబంధ విభాగాలు, పార్టీ కార్యాలయాల నిర్మాణాలు ఏ స్థాయిలో ఉండాలనే దానిపైనా కీలకంగా చర్చిస్తున్నట్లు సమాచారం. రానున్న పంచాయతీ, లోక్సభ ఎన్నికలకు పార్టీని సన్నద్దం చేయడంతో పాటు, పార్టీని మరింత బలోపేతం చేసుకొనే దిశగా వెంటనే చర్యలు ప్రారంభించాలని తీర్మానించినట్లు తెలిసింది. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు తలెత్తినా పార్టీ బలంగా నిలబడేందుకు క్షేత్రస్ధాయి నుంచి యంత్రాంగాన్ని బలంగా తీర్చిదిద్దాలనే దిశలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో కేటీఆర్ పార్టీ కార్యక్రమాల్లో వేగంగా దూసుకుపోతారనే సంకేతాలను ఇస్తున్నారు.