సలాం కేటీఆర్: అమెరికాలో గుండెపోటుతో వ్యక్తి మృతి.. సకాలంలో స్పందించిన మంత్రి
ఎవరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది భగవంతుడు. ఆ తర్వాతే ఎవరైనా గుర్తుకు వస్తారు. తెలంగాణలో కూడా ఎవరైనా ఇబ్బందులకు గురైతే ఆ భగవంతుడి తర్వాత గుర్తుకు వచ్చేది మంత్రి కేటీఆర్. అవును టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాన్యుల సమస్యలపై మంత్రి కేటీఆర్ స్పందించిన తీరు అందరి ప్రశంసలు అందుకుంటోంది. చిన్న పిల్లలు అనారోగ్యానికి గురై తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే కేటీఆర్ చొరవ చూపి ఆ కుటుంబంలో సంతోషం నింపారు. తాజాగా ఇలాంటి సమస్యనే ఒకటి కేటీఆర్ పరిష్కరించారు.
సామాన్యుడికి సమస్య వస్తే గుర్తుకు వచ్చేది మంత్రి కేటీఆర్
కేటీఆర్... దేశంలో ఈ పేరు తెలియని వారుండరు. సీఎం కేసీఆర్ కుమారుడనే మాటేగానీ తన స్వశక్తితో మంచి వాక్చాతుర్యంతో రాజకీయాల్లో ఎదిగి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్న నేత. సమస్యతో సహాయం కోసం వచ్చిన వారికి సహకారం అందించి వారి సమస్యను పరిష్కరిస్తారనే గుర్తింపు కేటీఆర్కు ఉంది. ఇక సామాన్యులకు వ్యక్తిగతంగా అందుబాటులో లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్గా ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు ఈ యువ నేత. తాజాగా అలాంటి సమస్యే కేటీఆర్ దగ్గరకు ట్విటర్ ద్వారా రాగా.. వెంటనే చొరవ చూపి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు.
అమెరికాలో గుండెపోటుతో మృతి చెందిన ప్రశాంత్
ఇక అసలు విషయానికొస్తే... సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నివాసి అయిన ప్రశాంత్ కొమ్మిరెడ్డి అమెరికాలోని డల్లాస్లో ఉంటున్నాడు. అతనికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. ప్రశాంత్కు భార్య మూడేళ్ల కుమార్తె ఉంది. ప్రశాంత్ భార్య నిండు గర్భిణీ. ఫిబ్రవరి 22వ తేదీన బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ సమయంలో ప్రశాంత్ మృతి చెందడంతో ఆమె పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కుటుంబ సభ్యులు అమెరికాకు రావాలంటే వీసా ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. హాస్పిటల్లో ప్రశాంత్ భార్య అడ్మిట్ అయ్యింది. మూడేళ్ల కుమార్తె ఒంటరిగా ఉంటోంది. వెంటనే ప్రశాంత్ స్నేహితుడు సంతోష్కు మంత్రి కేటీఆర్ గుర్తుకు వచ్చారు. ఆయనకు జరిగిన విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు.
Recommended Video
సంతోష్ ట్వీట్కు స్పందించిన మంత్రి కేటీఆర్
ప్రశాంత్ కుటుంబ సభ్యులకు వీసా ప్రక్రియ త్వరగా పూర్తయ్యేందుకు చొరవ చూపాలంటూ సంతోష్ ట్వీట్ చేశాడు. అంతేకాదు మరో మూడు రోజులు అమెరికాలో సెలవు దినాలు అని చెప్పాడు. ట్వీట్కు వెంటనే స్పందించారు మంత్రి కేటీఆర్. అమెరికా ఎంబసీకి జరిగిన విషయం గురించి ట్వీట్ చేశారు. వెంటనే ప్రశాంత్ సోదరుడికి వీసా ఇంటర్వ్యూను పూర్తి చేసి సహకరించాల్సిందిగా మంత్రి కేటీఆర్ అమెరికా ఎంబసీని కోరారు. అంతే క్షణాల్లో ప్రశాంత్ కుటుంబ సభ్యులకు అమెరికా ఎంబసీ నుంచి ఫోన్ వెళ్లింది. ప్రశాంత్ సోదరుడు బేగంపేట్లోని అమెరికా ఎంబసీకి వెళ్లాడు. వీసా ప్రక్రియ త్వరతగతిన పూర్తయ్యింది. అమెరికాకు చేరుకున్నాడు. సకాలంలో స్పందించిన మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు ప్రశాంత్ కుటుంబ సభ్యులు. అయితే లేబర్ రూంలో ఉన్న ప్రశాంత్ భార్యను మాత్రం ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఇదే సమయంలో ప్రశాంత్ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచింది అక్కడి తెలుగు కమ్యూనిటీ.