తెరాస గెలుపుకు ముగ్గురు కారణం, ఎవరంటే, ఇక బాధ్యత నాదే: కూకట్పల్లిలో కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస భారీ విజయానికి ముగ్గురు కారణని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం చెప్పారు. హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి నియోజకవర్గంలో జరిగిన తెరాస విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు అద్భుతంగా పని చేశారని చెప్పారు.
కేసీఆర్ నాయకత్వాన్ని ఆమోదించి ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. ఓట్లు వేసిన వారైనా, వేయని వారికైనా.. అందరికీ మనమే ఎమ్మెల్యేలమని, అందుకే అందరి మనసును గెలుచుకోవాలన్నారు. గెలుపుతో మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు.
అలా ఢిల్లీని శాసిస్తాం
ఎన్నికల్లో విజయం తెలంగాణ ప్రజలకు అంకితం అని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రజలు ఢిల్లీని యాచించడం కాకుండా శాసించాలని చెప్పారు. 16 ఏంపీ సీట్లు గెలిస్తే ఢిల్లీని శాసించే అవకాశం వస్తుందన్నారు. రకరకాల కారణాలతో మనకు దూరమైన నాయకులను, ప్రజలను మనం దగ్గర చేసుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలంతా మనవాళ్లే అన్నారు. తాము మొదటిసారి గెలిచిన నాలుగున్నరేళ్లు కులం, మతం అని చూడకుండా పేదవాడిని పేదవాడిగా చూశామని చెప్పారు. భవిష్యత్తులోను ఇలాగే ముందుకు సాగుతామన్నారు.
కూకట్పల్లి వేదికగా చెబుతున్నా
కూకట్పల్లి వేదికగా చెబుతున్నానని, ఇతర రాష్ట్రాల నుంచి సోదరులందరికీ ఓ మాట చెబుతున్నానని, ఆంధ్రా కావొచ్చు, కర్ణాటక కావొచ్చు, బెంగాల్ కావొచ్చు, పంజాబ్ కావొచ్చు.... మినీ భారతదేశం లాంటి హైదరాబాదులో ఇతర 28 రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరబడిన సోదరులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానని, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం, టీఆర్ఎస్ పార్టీ.. ఇదంతా మీ అందరిదీ, మనందరిదీ అన్నారు. ఇది ఏ కొందరిదీ కాదని చెప్పారు. అందరి పట్ల సానుకూలధోరణి, అందరిపట్ల ఒకేరకమైన ఆలోచనతో త్రికరణశుద్ధిగా పనిచేస్తామన్నారు.
కక్ష సాధింపు ఉండదు
ఎన్నికలకు ముందు ఓ మాట, తర్వాత మరో మాట, కక్ష సాధింపు ధోరణులు, రాజకీయ వేధింపులు పొరపాటున కూడా తెరాస చేయదని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఓటమిలో గుణపాఠం, గెలుపులో పాఠాలు ఉంటాయని చెప్పారు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయని, 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, ఈ రెండు ఎన్నికల్లో తెరాసకు ఎన్ని ఓట్లు వచ్చాయో అందరికీ తెలుసునని, అలాగే 2019 లోకసభ ఎన్నికల్లోను అలాగే రావాలన్నారు. గత రెండు పర్యాయాల కంటే ఎక్కువ మెజార్టీ 2019లో రావాలన్నారు. అందుకు ప్రణాళికతో వెళ్లాలన్నారు.
దూరమైన వారిని దగ్గర చేర్చుకోవాలి
ఓ వైపు గెలుపును ఆస్వాదిస్తూనే, మరోవైపు మనకు ఎక్కడ ఓట్లు తగ్గాయి, ఎందుకు తగ్గాయో లెక్కలు వేసుకోవాలని కేటీఆర్ సూచించారు. దూరమైన వర్గాలను దగ్గరకు తీసుకోవాలన్నారు. పోయిన ఓట్లను ఎలా తెచ్చుకోవాలో చూడాలన్నారు. ప్రజల కోసం పని చేస్తే ఈ రెండు పర్యాయాలే కాకుండా దశాబ్దాల పాటు ప్రజలు మనలను గుండెల్లో పెట్టుకుంటారని చెప్పారు. తెలంగాణ భారతదేశానికే ఆదర్శంగా ఉందన్నారు. 11 రాష్ట్రాల ప్రతినిధులు మిషన్ భగీరథను అధ్యయనం చేస్తున్నారని చెప్పారు. రైతు బంధు వంటి ఎన్నో అధ్భుత పథకాలు తీసుకు వచ్చామని, దేశానికి ఆదర్శంగా నిలబడే అరుదైన అవకాశం కేసీఆర్ నేతృత్వంలో వచ్చిందని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల కోసం తెరాస పని చేస్తుందన్నారు.
ఆ బాధ్యత నాదే
ఇప్పుడు నేను మంత్రిగా లేనని, పార్టీ నేతగా వచ్చానని, మంత్రిగా ఉన్నా లేకున్నా పార్టీ నాయకుడిగా కూకట్పల్లి నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో ఇచ్చిన మాటను నెరవేర్చే బాధ్యతను నేను తీసుకుంటానని కేటీఆర్ చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ఏ హామీని విస్మరించమని చెప్పారు. పార్టీ కార్యకర్తలు, నేతలు పని చేస్తేనే, ప్రజల ఆశీర్వాదంతో తెరాస అధికారంలోకి వచ్చిందని చెప్పారు. పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా నాయకులు పని చేయాలన్నారు. కూకట్పల్లిలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత నాది అని అక్కడి నుంచి గెలిచిన కృష్ణారావుకు చెప్పారు.
తెరాస విజయానికి ముగ్గురు కారణం
ఇంత అద్భుత, చిరస్మరణ, మరిచిపోలేని తెరాస విజయానికి, దశాబ్దాల పాటు మరిచిపోలేని ఈ విజయానికి ముగ్గురు కారణమని కేటీఆర్ చెప్పారు. ఒకరు కేసీఆర్ నాయకత్వం, రెండోది ప్రజల ఆశీర్వాదం కాగా, మూడోది అహర్నిషలు శ్రమించిన తెరాస నాయకులు, కార్యకర్తలు అన్నారు. తామే ఎమ్మెల్యే అభ్యర్థులము అన్నట్లుగా పని చేశారని, వారికి చేతులు జోడించి, వారికి విజయాన్ని అంకితం చేస్తున్నానని చెప్పారు.