టైం దగ్గరపడింది అందుకే: చంద్రబాబుపై కేటీఆర్, అమరావతి వార్తలపై మీడియాకు వార్నింగ్!
హైదరాబాద్: దిగిపోయే (అధికారం నుంచి) సమయం దగ్గర పడింది కాబట్టే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు ఇష్టం వచ్చినట్లు చాలా హామీలు ఇస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు బుధవారం అన్నారు. తెలంగాణ పథకాలను చంద్రబాబు కాపీ, పేస్ట్ చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ అంశం గురించి స్పందిస్తూ ఇళ్ల స్థలాలతో పాటు జర్నలిస్టుల సమస్యలను అన్నింటిని పరిష్కరిస్తామని కేటీఆర్ చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. తాను ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా జర్నలిస్టుల సంక్షేమం బాధ్యత తనదే అన్నారు. ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్కు టీయూడబ్ల్యూజే (143) ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడారు.
చంద్రబాబు డ్రామాలు ప్రజలకు తెలుస్తుంది
ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు డ్రామాలు చేస్తే ప్రజలకు తెలియకుండా పోతుందా అని ప్రశ్నించారు. నాలుగేళ్ల క్రితమే తాము ట్రాక్టర్లకు, ఆటోలకు పన్నులు రద్దు చేశామని చెప్పారు. చంద్రబాబు ఇప్పుడు కాపీ, పేస్ట్ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. మొన్నటి ఏపీ కేబినెట్లో వారు దీనిపై నిర్ణయం తీసుకున్నారన్నారు.
కాపీ, పేస్ట్ చేస్తే గెలుస్తారా?
కేసీఆర్ పథకాలను కాపీ, పేస్ట్ చేస్తే గెలిచిపోతామని అనుకుంటే ఎలాగని కేటీఆర్ ప్రశ్నించారు. ఏపీ ప్రజలు చాలా తెలివైన వాళ్లని, ఈ విషయాన్ని చంద్రబాబు మరిచిపోయినట్లుగా ఉన్నారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. వారు సరైన విధంగా తీర్పు ఇస్తారని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు.
వార్తలపై ఆగ్రహం
కొన్ని పేపర్లలో వస్తున్న వార్తలపై కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడారు. పత్రికా యాజమాన్యాల తీరులో మార్పు రావాలన్నారు. కొన్ని పేపర్లు అమరావతి వార్తలను తెలంగాణ ఎడిషన్లో రాస్తున్నాయని, మన తెలంగాణ వార్తలు మాత్రం అక్కడ (ఏపీలో) రాయడం లేదని చెప్పారు. తెలంగాణవాదాన్ని ఇంకా తొక్కుతామంటే ఊరుకునేది లేదని, ప్రభుత్వపరంగా ఏం చేయాలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కొన్ని మీడియా సంస్థలకు మేం ఏది చెబితే అదే వేదం, మేం ఏది చేస్తే అదే కరెక్ట్ అనే ధోరణి ఉందన్నారు. అది సరికాదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ పాత భావజాలాన్ని ఆయా సంస్థలు వదులుకోవడం లేదని చెప్పారు. తెలంగాణలో ఎవరూ ఆధిపత్యం చెలాయించాలని కోరుకోవడం లేదని, ఇప్పటికైనా పాత ఆలోచనా ధోరణిని మార్చుకోవాలన్నారు.
అమరావతిలో తెలంగాణ వార్తలేవీ.. ఆ డ్రామాలు నడవవు
తెలంగాణలో ఉదయం లేవగానే అమరావతి వార్తలు చూస్తున్నామని కేటీఆర్ అన్నారు. అమరావతి వార్తలతో తమకు ఇబ్బంది లేదని, కానీ అమరావతిలో కూడా తెలంగాణ వార్తలు వేయాలనే సంస్కారం ఉండాలని చురకలు అంటించారు. కానీ ఏపీలో తెలంగాణ వార్తలు రావన్నారు. తాను ఢిల్లీకి వెళ్లినప్పుడు ఓ పత్రికను తిరగేస్తే అసలు తెలంగాణ వార్తలే కనిపించలేదన్నారు. అసలు దేశంలో తెలంగాణ అనే రాష్ట్రం, దానికి ఓ ముఖ్యమంత్రి కూడా లేనట్లు సదరు పత్రిక తీరు ఉందన్నారు. ఈ విషయమై అక్కడే ఉన్నవాళ్లను అడిగితే అది ఏపీ ఎడిషన్ సార్ అన్నారని గుర్తు చేసుకున్నారు. ఏపీ ఎడిషన్లో తెలంగాణ వార్తలు రాయనప్పుడు తెలంగాణలో ఆంధ్రా వార్తలు ఎందుకన్నారు. దీనిపై జర్నలిస్టులు అందరూ ఆలోచించాలన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ మాట్లాడితే కొందరికి కోపం వస్తుందన్నారు. మేం అధిపత్యం చేస్తాం.. మేం చెప్పిందే వినాలనే డ్రామాలు ఇకపై నడవవన్నారు. తెలంగాణ పత్రికలు, మాధ్యమాలకు పెద్దపీట వేయాల్సిన అవసరముందన్నారు.