బాబుకు దిమ్మితిరిగేలా కౌంటర్లు: ఏపీలో కేసీఆర్కు బ్యానర్లు, అక్కడ మాకు ఆహ్వానం.. కేటీఆర్
నల్గొండ: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కర్ణాటక ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని ఇటీవల తెలంగాణ మహానాడులో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడంపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు సరైన కౌంటర్ ఇస్తున్నారు. మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి తదితరులు ప్రత్యక్షంగా, పరోక్షంగా స్పందించారు.
తెరాసను జాతీయ పార్టీగా ప్రకటిస్తే ఏపీలో కూడా గులాబీ జెండా సత్తా చాటుతుందని మంత్రి జగదీశ్వర్ రెడ్డి రెండు రోజుల క్రితం అన్నారు. టీడీపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని చంద్రబాబు పగటి కలలు కంటున్నారన్నారు. తెలంగాణలో సైకిల్ రెండు చక్రాలు ఊడిపోయాయని, ఆంధ్రాలో మరొక చక్రం ఊడిపోవడానికి సిద్ధంగా ఉందన్నారు.
చంద్రబాబులా నిజాం రాజు కూడా చెప్పలేదు
హైదరాబాద్ నగరాన్ని తానే నిర్మించానని చంద్రబాబు చెప్పుకుంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని జగదీశ్వర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నిర్మాణానికి భూమిపూజ చేసిన నిజాం రాజు కూడా ఏనాడూ చంద్రబాబు మాదిరిగా నగరాన్ని నిర్మించానని గొప్పగా చెప్పుకోలేదన్నారు. నగరాన్ని నిర్మించడం ఏ ఒక్కరి చేతిలోనో ఉండదని, శతాబ్ధాలుగా అందరి కృషి వల్ల సాధ్యం అవుతుందన్నారు.
ఏపీలోను టీఆర్ఎస్ పెట్టమని ఆహ్వానం
శనివారం కేటీఆర్ కూడా పరోక్షంగా చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించారు. నల్గొండ జిల్లాకు చెందిన పలువురు నేతలు ఆయన సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తమ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. ఏపీలోను తమ పార్టీని పెట్టమని అక్కడి వారు ఆహ్వానిస్తున్నారని, అంతేగాక కేసీఆర్ బ్యానర్లను సైతం ఏర్పాటు చేసి పాలాభిషేకం చేస్తున్నారన్నారు.
తెలంగాణలో కలపమని మహారాష్ట్ర రైతుల విజ్ఞప్తి
ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని కేటీఆర్ చెప్పారు. ఇతర రాష్ట్రాల ప్రజలు తెరాస పాలనను పొగుడుతున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు అసమర్థులని, ప్రజలంతా ఏకమై వారికి బుద్ధి చెప్పాలన్నారు. రైతుబంధు పథకం చూసి మహారాష్ట్రకు చెందిన 40 గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని కోరుతూ తీర్మానాలు చేసి మనవద్దకు వచ్చాయన్నారు. తెలంగాణ ప్రభుత్వ పనితనానికి ఇంతకన్నా పెద్ద ధ్రువీకరణ అవసరం లేదన్నారు.
ఆహ్వానిస్తున్నారు
ఏపీలోను కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ అక్కడా టీఆర్ఎస్ను పెట్టాలని అక్కడి సోదరులు కోరుతున్నారని కేటీఆర్ తెలిపారు. నాలుగేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ సృశించని రంగం లేదంటూ ప్రతీ రంగంలో ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగేలా పథకాలు రూపొందించారన్నారు. ప్రతిపక్షాలు చిల్లరమల్లర ఆరోపణలు చేస్తున్నాయని, కాంగ్రెస్ భావదారిద్య్రపు పార్టీ అన్నారు. నల్గొండ కాంగ్రెస్ నేతలకన్నా అసమర్థులు ఎక్కడా ఉండరని, నాలుగు దశాబ్దాలుగా ఫ్లోరోసిస్ వారి నిర్వాకమేనన్నారు. పక్కనుంచి కృష్ణానది పోతుంటే నల్గొండలో ఫ్లోరోసిస్ ఎలా ఉంటుందని, వాళ్లే మంచి పనులు చేసుంటే కృష్ణానది ఉన్న పాలమూరు నుంచి వలసలు ఉండేవా అన్నారు.