ఢిల్లీలో చంద్రబాబు కాళ్లపై పడితే కాంగ్రెస్ నేతలకు టిక్కెట్లు, భయపడేది లేదు: కేటీఆర్
మక్తల్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ మంత్రి (ఆపద్ధర్మ) కల్వకుంట్ల తారక రామారావు సోమవారం అన్నారు. మక్తల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఆయన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు. 55 ఏళ్లు కాంగ్రెస్, 17 ఏళ్లు తెలుగుదేశం పార్టీ పాలించిందని, తెలంగాణకు మాత్రం న్యాయం జరగలేదని కేటీఆర్ చెప్పారు.
చంద్రబాబూ! తట్టుకోలేవ్: తలసాని తీవ్రఆగ్రహం, జగన్ మీద దాడిపై శ్రీరెడ్డి ట్వీట్, రివర్స్
ఆరున్నర దశాబ్దాల్లో ఆ రెండు పార్టీలు చేయనిది, మేం నాలుగున్నరేళ్లలో చేసి చూపించామని చెప్పారు. మన నియామకాలు, మన వనరులపై మనకు హక్కు ఉండాలని అందరం పోరాటం చేశామని చెప్పారు. ఉమ్మడి ఏపీలో అందరికంటే ఎక్కువగా నష్టపోయింది మహబూబ్ నగర్ జిల్లా అన్నారు. బూర్గుల రామకృష్ణారావు 1950 నుంచి 1956 వరకు నాటి ఏపీకి సీఎంగా ఉన్నారని గుర్తు చేశారు. ఏపీ, తెలంగాణను కలిపింది నాటి ప్రధాని నెహ్రూ అని మండిపడ్డారు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు మనకు అన్ని వనరులు ఉన్నా కాంగ్రెస్, టీడీపీలు ఏం చేయలేదన్నారు.
మా వల్లే తిరిగి వచ్చారు
ఈ నాలుగున్నరేళ్లలో ఎంతో చేశామని, కానీ ఇది సరిపోదని, ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ వస్తే మన రాష్ట్రం అంధకారంలో ఉండిపోతుందని నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని, కానీ ఇప్పుడు 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకంపై కోర్టుకు వెళ్లి, ఇక్కడి ప్రజల నోట్లో మట్టి కొట్టింది కాంగ్రెస్ నేతలు అన్నారు. వలసలు వెళ్లిన పాలమూరువాసులు తిరిగి రావడానికి టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనే కారణమని చెప్పారు.
అదో మాయాకూటమి
కింది రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టును ఆపేందుకు కేంద్రానికి 30 లేఖలు రాశారని చెప్పారు. అలాంటి చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీ మహాకూటమి మాయాకూటమి అని, అది అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రభుత్వం జుత్తు చంద్రబాబు చేతిలో ఉంటుందని అన్నారు. అప్పుడు పాలమూరు ప్రాజెక్టులు ఆగిపోతాయని హెచ్చరించారు. దయచేసి ప్రజలు జాగ్రత్తగా ఆలోచించాలన్నారు. పొరపాటున మహాకూటమి అభ్యర్థికి ఓటు వేస్తే ఏం చేయరని చెప్పారు.
చంద్రబాబు చెప్పినట్లు వింటారు
టీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే మాత్రం మీరు ఏం చేయమంటే అది చేస్తారని, ఆయనకు మీరే (ప్రజలు) బాస్లు అన్నారు. రామ్మోహన్ రెడ్డి తెలంగాణ కోసమే తెరాసలో చేరారని చెప్పారు. టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే, ఆయన గెలిస్తే చంద్రబాబు చెప్పినట్లుగా వింటారని చెప్పారు. ఏ పార్టీ అయితే తెలంగాణ పచ్చపడవద్దని కోరుకుందో, ఏ నేత అయితే పాలమూరుపై కక్ష కట్టారో అలాంటి చంద్రబాబు నాయుడు మనకు అవసరమా అన్నారు. ఇక్కడ ఎన్నికలు రామ్మోహన్ రెడ్డి (టీఆర్ఎస్ అభ్యర్థి) వర్సెస్ దయాకర్ రెడ్డి (టీడీపీ అభ్యర్థి) కాదని, మన బతుకు అని అభిప్రాయపడ్డారు.
మోడీ, చంద్రబాబులకు భయపడేది లేదు
మనమంతా కేసీఆర్ వెంట తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేస్తామని కేటీఆర్ చెప్పారు. మోడీ అంటే భయపడేది లేదని, చంద్రబాబు అంటే భయపడేది లేదని, పాలమూరు కోసం దేవుడితో అయినా పోరాడుతామని చెప్పారు. మహాకూటమి గెలిస్తే జుత్తు చంద్రబాబు, రాహుల్ గాంధీల చేతిలో ఉంటాయని చెప్పారు. మనం ఏ గట్టున ఉంటామో నిర్ణయించుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తేజ నటించిన రంగస్థలం సినిమా ప్రస్తావన తెచ్చారు. ఈ గట్టున ప్రజల కోసం పని చేసే కేసీఆర్, ఆ గట్టున ప్రజలకు అన్యాయం చేసే మహాకూటమి ఉందని చెప్పారు.
ఢిల్లీలో చంద్రబాబు కాళ్లపై పడితే కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లు
రాష్ట్ర ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలి అనేదే మన నినాదం అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో జైపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి.. ఇలా 40 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవా చేశారు. మీ జిల్లాలోనే (పాలమూరు) నలుగురు వరకు ఉన్నారని చెప్పారు. కూటమి అధికారంలోకి వస్తే ప్రతి నెల లాటరీ తీసి ఓ వ్యక్తిని సీఎంగా చేస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిని ఢిల్లీ డిసైడ్ చేస్తుందని చెప్పారు. టిక్కెట్లు కావాలంటే కాంగ్రెస్ పార్టీ వాళ్లు హైదరాబాదులో కాకుండా ఢిల్లీలో చంద్రబాబు కాళ్లపై పడితే వారికి టిక్కెట్లు వస్తాయన్నారు. ఉత్తమ్ అర్ధరాత్రి ఏపీ భవన్లో చంద్రబాబును కలిసి డిసైడ్ చేస్తారన్నారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు.