కోదండకు చేయిచ్చారు, ఆమెకు ఓపికలేక పార్టీ మారారు: కేటీఆర్, బీజేపీ ఐదో జాబితా ఇదే
హైదరాబాద్/చొప్పదండి: పార్టీ అధినేత కేసీఆర్ చొప్పదండి అల్లుడు అని, ఆయనను చొప్పదండి ప్రజలు బాగా చూసుకోవాలని మంత్రి (ఆపద్ధర్మ) కేటీఆర్ ఆదివారం అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే చొప్పదండి అభ్యర్థిని మార్చవలసి వచ్చిందని చెప్పారు. ఆ అభ్యర్థికి ఓపిక లేక వేరే పార్టీలో చేరారని మండిపడ్డారు. రైతు బంధు పథకానికి ఐక్య రాజ్య సమితి గుర్తింపు వచ్చిందని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం గుర్తించలేకపోయిందన్నారు.
కోదండరాంకు కాంగ్రెస్ చేయి
తెలంగాణ జన సమితి చీఫ్ కోదండరాంను కాంగ్రెస్ పార్టీ కరివేపాకులా వాడుకుందని కేటీఆర్ విమర్శించారు. ఆయనకు కాంగ్రెస్ మొండిచేయి ఇచ్చిందని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సీట్లు ఇచ్చినా, ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నోట్లు ఇచ్చినా తెలంగాణ ప్రజల ఓట్లు మాత్రం మావే అన్నారు.
తెరాస నో చెప్పడంతో బీజేపీ నుంచి శోభకు టిక్కెట్
కాగా, కేటీఆర్ విమర్శలు గుప్పించిన ఆ అభ్యర్థి బొడిగె శోభ. ఆమెకు తెరాస టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఆమె భారతీయ నతా పార్టీ (బీజేపీ)లో చేరారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ సమక్షంలో ఆమె కమలం తీర్థం పుచ్చుకున్నారు. టిక్కెట్ హామీపై ఆమె బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆమెకు టిక్కెట్ వచ్చింది. బీజేపీ ఆదివారం మరో జాబితాను ప్రకటించింది. అందులో ఆమెకు స్థానం దక్కింది.
బీజేపీ ఐదో జాబితా అభ్యర్థులు వీరే
బొడిగె శోభకు టిక్కెట్ రావడంతో ఆమె అభిమానులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చొప్పదండి నుంచి తెరాస తరఫున రవిశంకర్ పోటీ చేస్తున్నారు. బొడిగె శోభ 2014లో గెలిచారు. కానీ ఈసారి టిక్కెట్ రాకపోవడంతో జంప్ అయ్యారు. అయిదో జాబితాలో జుక్కల్ (ఎస్సీ)- అరుణ తార, బాన్సువాడ- నాయుడు ప్రకాష్, బాల్కొండ- ఆర్ రాజేశ్వర్, మంథని- రెండ్ల సనత్కుమార్, చొప్పదండి (ఎస్సీ)- బోడిగె శోభ, మహేశ్వరం- అందెల శ్రీరాములు యాదవ్, వికారాబాద్ (ఎస్సీ)- రాయిపల్లి సాయికృష్ణ, జడ్చర్ల- డాక్టర్ మధుసూదన్ యాదవ్, కొల్లాపూర్- సుధాకర్ రావు, దేవరకొండ (ఎస్సీ)- డాక్టర్ జరుప్లావత్ గోపి ( కల్యాణ్ నాయక్), మిర్యాలగూడ- కరణాతి ప్రభాకర్, హుజూర్ నగర్- బొబ్బ భాగ్యారెడ్డి, కోదాడ- జల్లేపల్లి వెంకటేశ్వరరావు, తుంగతుర్తి (ఎస్సీ)- కడియ రామచంద్రయ్య, జనగామ- కేవీఎల్ఎన్ రెడ్డి (రాజు), డోర్నకల్ (ఎస్టీ)- లక్ష్మణ్ నాయక్, వరంగల్ తూర్పు- కుసుమ సతీష్, ములుగు (ఎస్టీ)- బానోతు దేవీలాల్, కొత్తగూడెం- బైరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు టిక్కెట్ కేటాయించారు.
మంచి ముహూర్తం, రేపు ఎక్కువ మంది నామినేషన్
కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రేపు నామినేషన్ వేసేందుకు తుది గడువు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్కు అవకాశముంటుంది. రేపు మంచి ముహూర్తం ఉందని చాలామంది ఆ రోజు నామినేషన్ వేసేందుకు సిద్ధయయ్యారని తెలుస్తోంది. అలాగే, చివరి రోజు కాబట్టి ఎక్కువ నామినేషన్లు కూడా ఉంటాయి.
Recommended Video