ఇదిగో చూడండి నెంబర్ 1 తెలంగాణ: కిరణ్ కుమార్ వ్యాఖ్యలపై మరోసారి కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ వస్తే పరిశ్రమలు రావని కొందరు చెప్పారని, కానీ ఇప్పుడు పారిశ్రామిక రంగంలో తెలంగాణ నెంబర్ వన్ అని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరోసారి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేటీఆర్ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రెండేళ్లలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. కేసీఆర్ సంస్కరణలతో నవ తెలంగాణ దూసుకెళ్తోందని చెప్పారు. ఈ రెండేళ్లలో ఎన్నో మైలురాళ్లు అధిగమించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో అవార్డులు వచ్చాయని చెప్పారు. అతితక్కువ కాలంలో తెలంగాణ దేశానికి మోడల్ స్టేట్గా నిలిచిందన్నారు.
తెలంగాణ నెంబర్ వన్ స్థానం పొందడానికి అన్ని డిపార్టుమెంట్లు కృషి చేశాయన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయడంతో పారిశ్రామిక రంగంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచామని కేటీఆర్ చెప్పారు. పారిశ్రామిక రంగం పైన 60 సమావేశాలు నిర్వహించామన్నారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా టీఎస్ ఐపాస్ ప్రవేశ పెట్టామని చెప్పారు. పారిశ్రామిక రంగాన్ని సరళతరం చేసేందుకు 26 చట్టాలు సవరించి కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టామని చెప్పారు. మొత్తం 380 అంశాల పైన కేంద్రం సర్వే చేస్తో 324 అంశాలలో తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు.
కొత్తగా 113 ఆన్ లైన్ సర్విసెస్ లాంచ్ చేశామని చెప్పారు. తెలంగాణ వస్తే పెట్టుబడులు రావని గతంలో అపోహలు సృష్టించారన్నారు. కాని పారిశ్రామిక రంగంలో తెలంగాణ నెంబర్ వన్గా నిలిచిందన్నారు. సింగిల్ విండో విధానం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు.
తాము చేపట్టిన సంస్కరణలు కార్యరూపం దాల్చాయి కాబట్టే అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. 14 రకాల రిటర్న్స్ ఒకే పరిధిలోకి తీసుకు వచ్చామని చెప్పారు. లేబర్, ఫ్యాక్టరీ డిపార్టుమెంట్లు సమన్వయంతో పని చేస్తున్నాయని చెప్పారు. 340 అంశాల్లో తెలంగాణకు 336 మార్కులు వచ్చాయన్నారు.
లేబర్ డిపార్టుమెంటులో 22 సర్వీసులు ప్రారంభించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరిస్తోందని, అందుకు కృతజ్ఞతలు అని కెటిఆర్ చెప్పారు. టిఎస్ పాస్ను విదేశాలు కూడా ప్రశంసిస్తున్నాయని చెప్పారు. పరిశ్రమల తనిఖీల్లోను కీలక మార్పులు చేశామన్నారు. ఐదేళ్లుకు ఓసారి తనిఖీలు చేసేలా చేశామన్నారు. తొమ్మిది నెల్లలోనే అద్భుతమైన ప్రగతి సాధించామన్నారు.
ప్రతిపక్షాలవి అనవసర ఆరోపణలు అన్నారు. తమ పైన చేసిన ఆరోపణలను నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమని చెప్పారు. తెలంగాణ నెంబర్ వన్ కేసీఆర్ అని కేంద్రం చెప్పినా, తెలంగాణ అన్నింటా ముుందుందని కేంద్రం చెప్పినా, కేసీఆర్కు తిరుగులేదని ఓ ప్రయివేటు సంస్థ చెప్పినా.. తమను విమర్శిస్తే ఎలా అన్నారు. ఇక వాళ్లే తెలివివంతులా అని ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వారు చేసే వ్యాఖ్యలను చూసి నవ్వుకోవాల్సి వస్తోందన్నారు.
తమ ప్రభుత్వం చేసిన సంస్కరణల వల్ల లక్షా 61 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించిందన్నారు. అన్ని డిపార్టుమెంట్లన్నింటికి ఒకే రిజిస్ట్రేషన్ కిందకు తీసుకొచ్చామన్నారు. పరిపాలనా ఫలాలను అవినీతిరహితంగా ప్రజలకు అందించాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్నారు. ఫార్మా రంగంలో పెట్టుబడుల కోసం కృషి చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ చేసిన దిశానిర్దేశం మేరకు అభివృద్ధి సాధ్యమైందన్నారు.