పథకాలు అందలేదని నిలదీస్తారా ? ప్రజలకు మనం ఏమీ బాకీ లేమన్న కేటీఆర్
Recommended Video
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఈమధ్య సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న డాక్టర్లను ఉద్దేశించి ఇష్టం ఉంటే పని చేయండి. లేకపోతే మానేసి వెళ్లిపోండి. కొత్తవారిని తీసుకుంటాం అని కేటీఆర్ క్లాస్ పీకారు. ఇక తాజాగా ప్రజలనుద్దేశించి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మనమేమీ బాకీ లేమంటూ నేతలకు తేల్చిచెప్పారు.కేటీఆర్ తాజా వ్యాఖ్యలు అటు తెలంగాణ ప్రజలలోనూ , రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి.
ప్రజలనుద్దేశించి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సంక్షేమ పథకాలు అందటం లేదని ప్రజలు, ప్రజా ప్రతినిధులను, అధికారులను నిలదీస్తున్నారని , గొడవకు దిగుతున్నారని జడ్పిటిసి సభ్యులు కేటీఆర్ కు విన్నవించారు. ఇక దీనిపై స్పందించిన కెటీఆర్ ప్రజలకు మనమేమీ బాకీ లేమని తేల్చిపారేశారు. ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్నవి ప్రోత్సాహకాలేనని, వారికేమీ మనం బాకీ లేమని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని ఆలోచింపజేస్తున్నాయి.
ప్రోత్సాహకాలు ఇచ్చినంత మాత్రాన బాకీ ఉన్నట్టు కాదు .. నిలదీస్తే ఎలా అన్న కేటీఆర్
సిరిసిల్ల జెడ్పీటీసీ సభ్యులతో మాట్లాడిన కేటీఆర్ అతి విశ్వాసం వల్ల కరీంనగర్ ఎంపీ సీటును కోల్పోయామని పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో కేటీఆర్ తాజా వ్యాఖ్యలు చేశారు. పలానా పథకం తమకు అందలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే ప్రజా ప్రతినిధులు, అధికారులు వారికి నచ్చచెప్పాలని సూచించారు. వారితో గొడవకు దిగొద్దని కేటీఆర్, ఇక ప్రజా ప్రతినిధులను, ప్రజలను ఉద్దేశించి ఈ విషయంలో అధికారులను అడగండి కానీ ,నిలదీయవద్దని వారికీ భార్య, పిల్లలు ఉంటారని పేర్కొన్నారు.
మరుగుదొడ్ల నిర్మాణం, కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు మాత్రమేనని, ప్రోత్సాహకాలు ఉన్నంత మాత్రాన అవి ప్రజలకు బాకీ పడిన సొమ్ము కాదని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మనమేమీ బాకీ లేమని, సంక్షేమ పథకాలు అందించినంత మాత్రాన ప్రజలకు బాకీ ఉన్నట్టు కాదని పేర్కొన్నారు. అవగాహనతో అధికారులను ప్రశ్నిస్తే గౌరవం పెరుగుతుందని, లొల్లి చేస్తే పేపర్లో ఫొటోలు మాత్రమే వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు.
కేటీఆర్ తాజా వ్యాఖ్యలపై అభ్యంతరం .. ఇస్తుంది ప్రజాధనమే అంటూ విమర్శలు
కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు మనమేమీ బాకీ లేమని కేటీఆర్ చేసిన వ్యాఖ్యపై పెద్ద చర్చ జరుగుతోంది. ప్రజా ధనాన్ని ప్రజల కోసం వినియోగిస్తూ తమ డబ్బు ఇచ్చినట్టుగా ప్రభుత్వం ఫీలవుతుందని , అందుకే కేటీఆర్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అది చేస్తాం, ఇది చేస్తామని ఎన్నికల్లో హామీల వర్షం కురిపించిన తెలంగాణ సర్కార్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం బాధ్యత మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలకు ఉన్న బాకీ అని తేల్చి చెప్తున్నారు.
ఇటీవల కాలంలో చాలా సందర్భాల్లో కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న కేటీఆర్, ప్రజా ఓట్లతో గద్దెనెక్కిన టిఆర్ఎస్ పార్టీ ఈ తరహా వ్యాఖ్యలు చేసి విమర్శలకు గురికావడం కరెక్ట్ కాదనే అభిప్రాయం పెద్ద ఎత్తున వినిపిస్తోంది.