చంద్రబాబుతోనే అసలు పంచాయతీ, న్యాయం జరగదు: మళ్లీ కేటీఆర్ నిప్పులు
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని తెలంగాణ రాష్ట్ర నేత, ఆపద్ధర్మ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం అన్నారు. ఆయన బంజారాహిల్స్లో జరిగిన మహారాజ శ్రీ అగ్రసేన్ 5142వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
పవన్పై తెలంగాణ నేతల ఒత్తిడి, కేసీఆర్ వైపేనా.. ఇదీ లెక్క: అదే జరిగితే బాబు-జగన్లకు దొరికినట్లే!
మనకు సరిహద్దుల్లో ఉన్న కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సహా ఏ రాష్ట్రంతోను పంచాయతీ లేదని చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతోనే పంచాయతీ అన్నారు. ప్రాజెక్టులు ఆపడం కోసం ఢిల్లీకి లేఖలు రాశారన్నారు. అలాంటి టీడీపీతో కాంగ్రెస్ కలిసిందన్నారు. వీరు అధికారంలోకి వస్తే చంద్రబాబు చెప్పినట్లు కాంగ్రెస్ వింటుందని, అప్పుడు ప్రాజెక్టులు పూర్తి కావన్నారు.
చంద్రబాబు వల్ల తెలంగాణకు న్యాయం జరగదు
చంద్రబాబు పాదదాసుల వల్ల తెలంగాణకు న్యాయం జరగదన్నారు. పేదరికానికి కులం లేదన్నారు. సంక్షేమం కోసం బడ్జెట్లో 43 శాతం నిధులు కేటాయించామన్నారు. కాంగ్రెస్ హయాంలో 29 లక్షల మందికి పింఛన్ ఇస్తే తాము 43 లక్షల మందికి ఇచ్చామన్నారు. కేసీఆర్ మనవడు, మనవరాలు తింటున్న సన్నబియ్యమే హాస్టళ్లలో పేద విద్యార్థులు తింటున్నారని చెప్పారు. అగ్రకులాలకు ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికన న్యాయం చేయాలనేది కేసీఆర్ ఆలోచన అని చెప్పారు.
పెట్టుబడులు వస్తున్నాయి
గత ప్రభుత్వం హయాంలో పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించేవారని కేటీఆర్ చెప్పారు. టీఆర్ఎస్ హయాంలో నిరంతర విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. టీఎస్ ఐపాస్ ద్వారా పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని రంగాలకు పెద్దపీట వేస్తోందన్నారు.
జై వాసవీ అంటు ప్రసంగం ముగించిన కేటీఆర్
వ్యాపారులు, వర్తకులు, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని కేటీఆర్ తెలిపారు. వ్యవసాయ రంగం, రైతుల సంక్షేమం కోసం చర్యలు చేపట్టామన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు సత్వర అనుమతులు ఇస్తున్నామని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి అందరి సహకారం కావాలన్నారు. మాట్లాడిన అనంతరం కేటీఆర్ జై తెలంగాణ, జై వాసవీ అన్నారు.
చంద్రబాబు ఫేమస్ లాస్ట్ వర్డ్స్ అంటూ సెటైర్లు
ఇదిలా ఉండగా, కేటీఆర్ ఏపీ సీఎం చంద్రబాబుపై రెండు ట్వీట్లు చేశారు. అవినీతితో కూడిన కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయడం తమ లక్ష్యమని, కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసేందుకు ఏమైనా చేస్తామని చంద్రబాబు నాలుగేళ్ల క్రితం ఓ ట్వీట్ చేశారు. దానిని కేటీఆర్ రీట్వీట్ చేస్తూ సెటైర్ వేశారు. చంద్రబాబు నాయుడి ఫేమస్ లాస్ట్ వర్డ్స్ అంటూ ఎద్దేవా చేశారు.