జీహెచ్ఎంసీలో ఖాళీలు భర్తీ చేస్తాం: కేటీఆర్, ‘కంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ’
జీహెచ్ఎంసీలో ఖాళీలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని ఐటీ, పరిశ్రమలు, పురపాలక, గనుల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీలో ఖాళీలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని ఐటీ, పరిశ్రమలు, పురపాలక, గనుల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. బుధవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. . ప్రశ్నోత్తరాల్లో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ.. త్వరలోనే 533 కొత్త పోస్టులను భర్తీ చేస్తామన్నారు. 238 టౌన్ ప్లానింగ్ పోస్టులతో పాటు శానిటేషన్, ఇతర విభాగాల్లో నియామకం చేపడుతామని స్పష్టం చేశారు.
కొత్తగా అప్గ్రేడ్ చేసిన మున్సిపాలిటీల్లోనూ భర్తీలను చేపడుతామని ప్రకటించారు. గ్రామపంచాయతీలు స్వయం సమృద్ధి సాధించాలన్నారు. డ్రైపోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. హైదరాబాద్ కు ఇరువైపులా డ్రైపోర్టులను ఏర్పాటు చేస్తామన్నారు. డ్రైపోర్టుల నిర్మాణానికి మొదటి దశలో రూ. 1,656 కోట్లు, రెండో దశలో రూ. 2,034 కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు.
ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం: నాయిని
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నామని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నాయిని మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం హైవేలపై మద్యం షాపుల నిషేధానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. డ్రైవింగ్ లెసెన్స్లను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట
రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టామని ఐటీ, పరిశ్రమలు, గనులు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణాల్లో అవకతవకలకు పాల్పడిన అధికారులపై వేటు వేశామని పేర్కొన్నారు. జరిమానాల రూపంలో ప్రభుత్వానికి రూ. 11.8 కోట్ల ఆదాయం వచ్చిందని ప్రకటించారు.
జనవరి చివరి నాటికి జీపీఎస్ విధానం అమల్లోకి తీసుకొస్తామన్నారు. ఇసుక అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అవసరమైన చోట ఇసుక రీచ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒడిశాకు ప్రత్యేక బృందం వెళ్లి మైనింగ్ పై అధ్యయనం చేసిందన్నారు. ఇసుక అక్రమ కట్టడిలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తేల్చిచెప్పారు. కొత్త మైనింగ్ పాలసీ తుది దశలో ఉందన్నారు. త్వరలోనే కేబినెట్ ముందుకు తీసుకువస్తామని ప్రకటించారు.
బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉంది
బ్రహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గృహ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బ్రహ్మణుల సంక్షేమంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. బ్రహ్మణుల అభివృద్ధికి ప్రత్యేక జీవో తీసుకొచ్చామన్నారు.
బ్రహ్మణ సంఘం ఏర్పాటుకు స్థల సేకరణ కూడా జరిగిందన్నారు. బ్రహ్మణుల జీత, భత్యాల అంశంపై అధ్యయనం చేసేందుకు ఐదుగురు మంత్రులతో సీఎం కేసీఆర్ కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. బ్రహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్కు ఏడాదికి రూ. 100 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 1805 దేవాలయాల్లోని అర్చకులకు నెలకు రూ. 6 వేలు ఇస్తున్నామని వివరించారు.
కాంట్రాక్టర్ లెక్చరర్ల క్రమబద్దీకరణ చేస్తాం: కడియం
ప్రభుత్వ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్దీకరిస్తామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కడియం మాట్లాడారు. రాష్ట్రంలో మూడు వేల పైచిలుకు లెక్చరర్లు జూనియర్ కళాశాల్లో పని చేస్తున్నారని తెలిపారు. వీరందరిని క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. మంత్రివర్గ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
అయితే కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీకరణకు సంబంధించి కొంతమంది అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారని చెప్పారు. ఈ క్రమంలోనే క్రమబద్దీకరణ ఆగిపోయిందన్నారు. కోర్టు నుంచి డైరెక్షన్ వస్తే కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీరణకు మార్గం సులువు అవుతుందన్నారు.
ఇటీవలే కాంట్రాక్ట్ లెక్చరర్ల జీతాలు కూడా పెంచామని గుర్తు చేశారు. అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ను అమలు చేస్తున్నామని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. జూనియర్ కళాశాలల్లో గత రెండేళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు.