అంతా కలెక్టర్, అధికారుల వల్లే: కేటీఆర్ ఆగ్రహంపై తలపట్టుకున్నారు, మంత్రి వస్తే ఆమ్రపాలి ఇలా..
వరంగల్ నగర అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేయడంతో అధికార పార్టీ నేతలు ఇరకాటంలో పడ్డారు.
వరంగల్: వరంగల్ నగర అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేయడంతో అధికార పార్టీ నేతలు ఇరకాటంలో పడ్డారు. రెండ్రోజుల క్రితం కేటీఆర్ ఎమ్మెల్యేలు, కలెక్టర్ ఆమ్రపాలి, ఇతర అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు ఇస్తుంటే, ఇక్కడ మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని, రూ.300 కోట్ల అభివృద్ధిపై ప్రజలకు జవాబు చెప్పుకునేదెలా? అని కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఆమ్రపాలి! వాదనొద్దు, కేసీఆర్ వచ్చి నోట్లో ముద్ద పెడతారా: కలెక్టర్-వినయ్లపై కేటీఆర్ ఆగ్రహం
కేటీఆర్ వ్యాఖ్యలతో విపక్ష నేతలు తెరాసపై విరుచుకుపడుతున్నారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలనే చూపిస్తూ విపక్షాలు విమర్శిస్తుంటే ఏం చేయాలో తెలియక, వాటిని తిప్పికొట్టలేక అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారట.
కేసీఆర్ ఇంకెంత ఆగ్రహిస్తారో?
ఈ నెల 22న జిల్లా పర్యటనకు విచ్చేయనున్న ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ ఎలా స్పందిస్తారోనని, ఇంకెంత ఆగ్రహం వ్యక్తం చేస్తారోనని తెరాస నేతలు ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది.
ఇదీ అధికారుల సమాధానం!
శనివారం జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా వంత పాడారు. మరోవైపు, ఉన్నతాధికారులు మాత్రం.. నిధుల్లేవని, ప్రణాళికలు లేవని, సిబ్బంది లేరని, తామేం చేయగలరని అంటున్నారట.
కేటీఆర్ వ్యాఖ్యలతో రివర్స్
రూ.300 కోట్లతో అభివృద్ధి, స్మార్ట్ సిటీ సాకారమంటూ ప్రజలకు హామీ ఇచ్చామని, ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలు మనకు ప్రతికూలంగా మారాయని, ఏం చెప్పలేని పరిస్థితి ఎదురైందని తెరాస నేతలు గుసగుసలాడుకుంటున్నారట. ఇన్నాళ్లు తాము చెప్పిందే నిజమని విపక్షాలు చెబుతుండటంతో ఏం చేయాలో అధికార పార్టీ నేతలకు పాలుపోవడం లేదట.
మూలిగే నక్కపై తాడిపండు పడినట్లు
కలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధులపై ఓ వైపు మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే అదే సమయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. సీఎం ఇచ్చిన కమ్యూనిటీ భవనాలు, శ్మశాన వాటికలు, మోడల్ మార్కెట్లకు దిక్కులేదని అభిప్రాయపడ్డారు. ఇది వారిని మరింత ఇబ్బందులకు గురి చేసింది.
ఎన్నికలకు ముందు ఇలానా?
మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రానున్నాయి. లేదా ముందస్తు ఎన్నికలకు అవకాశముంది. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ ఇలా మాట్లాడటం సరికాదని అధికార పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. ఇది ఊహించని పరిణామమని వాపోతున్నారని తెలుస్తోంది. ఏడాది టార్గెట్ ఇచ్చి, అప్పటికి పూర్తి కాకుంటే తాను రంగంలోకి దిగుతానని కేటీఆర్ చెప్పారు. ఈ నెల 24వ హైదరాబాద్ రమ్మని చెప్పడం వారిలో గుబులు రేపుతోంది.
కలెక్టర్, కమిషనర్ల పనితీరుపై అసంతృప్తి
జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శృతి ఓఝాలు అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, అమలులో క్రియాశీలంగా ఉండటం లేదనే విమర్శలు అధికార పార్టీ నేతల నుంచి వస్తున్నాయి.
కేటీఆర్ వచ్చిన తర్వాత ఆమ్రపాలి
కేటీఆర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులోకి వచ్చిన తర్వాత సమావేశానికి కలెక్టర్ ఆమ్రపాలి హాజరయ్యారని చెబుతున్నారు. ఇదే విషయాన్ని ప్రజాప్రతినిధులు ప్రస్తావిస్తున్నారట. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదని, కలెక్టర్, ఇతర అధికారులు దానిని సమర్థంగా నిర్వహించలేదని వాపోతున్నారని తెలుస్తోంది.
హడావిడిగా ఇలా చేశారు
కేటీఆర్ అసంతృప్తి నేపథ్యంలో ఆ తర్వాత కలెక్టర్ ఆమ్రపాలి వరంగల్ అభివృద్ధికి కేటాయించిన రూ.300 కోట్ల నిధులను హడావిడిగా సమగ్ర వివరాలతో ప్రకటన విడుదల చేశారని అంటున్నారు.