టాక్: కెటిఆర్ నమస్తే తెలంగాణ స్టాఫ్ను దులిపేశారా, ఏం జరుగుతోంది?
నమస్తే తెలంగాణ వ్యవహారాల పట్ల కెటిఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పత్రిక సిబ్బందితో సమావేశమై దులిపేసినట్లు ప్రచారం సాగుతోంది.
హైదరాబాద్: తెలంగాణ మంత్రి, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనయుడు కెటి రామారావు ఇటీవల నమస్తే తెలంగాణ సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి ఆయన అసంతృప్తిని బయటపెట్టినట్లు ప్రచారం సాగుతోంది.
నమస్తే తెలంగాణ దినపత్రిక తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధికారిక పత్రిక అనే విషయం అందరికీ తెలిసిందే. అంతకన్నా అది కెసిఆర్ పత్రిక. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ కాలంలో ఆ పత్రిక ప్రారంభమైంది. దాని యాజమాన్యం ప్రముఖ వ్యాపారవేత్త లక్ష్మీరాజం చేతుల నుంచి కెసిఆర్ చేతులకు మారింది.
ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రజలు ఆ పత్రికను ఓ రకంగా ఆదరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కెసిఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది ప్రభుత్వ వ్యతిరేక వార్తలను రాయలేని స్థితిలో పడిపోయింది. అయితే, ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలనేది కెసిఆర్ ఉద్దేశం. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనలను, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇతర పత్రికల కంటే నమస్తే తెలంగాణ వెనుకబడి ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మంత్రి కెటిఆర్ సిబ్బందిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.
కెటిఆర్ జోక్యం తొలిసారి...
నమస్తే తెలంగాణ పత్రిక నిర్వహణ వ్యవహారాల్లో కెటిఆర్ జోక్యం చేసుకోవడం ఇదే తొలిసారి అంటున్నారు. అప్పుడప్పుడు పత్రికలోని ఉన్నతస్థాయి సిబ్బందితో మాట్లాడిన సందర్బాలు మాత్రమే ఉన్నాయని, ఇలా నేరుగా పత్రికా సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి దులిపేయడం మొదటిసారి అని అంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో పత్రిక విఫలమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
కవిత జోక్యం కొన్నిసార్లు...
నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత మాత్రం నమస్తే తెలంగాణ పత్రిక వ్యవహారాల్లో ప్రత్యక్ష జోక్యం చేసుకున్న సందర్భాలున్నాయి. ఆమె సిబ్బందితో కొన్నిసార్లు సమావేశాలు ఏర్పాటు చేసినట్లు కూడా చెబుతారు. ఆమె కూడా పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆమె జోక్యం వల్ల కొన్ని సెక్షన్ల హెడ్స్ మారినట్లు ప్రచారం సాగుతోంది.
అప్పుడు కెటిఆర్ అలా...
గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ ఎన్నికల్లో తెరాస ఘన విజయం తర్వాత కెటిఆర్కు కెసిఆర్ అదనంగా మున్సిపల్ వ్యవహారాల శాఖను అప్పగించారు. ఈ ఎన్నికల బాధ్యతను పూర్తిగా తన భుజాల మీద వేసుకుని పార్టీకి విజయం సాధించిపెట్టినందుకు కానుకగా కెటిఆర్కు ఆ శాఖను అప్పగించారనే విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో ఆంధ్ర యాజమాన్యంలో నడిచే ఓ పత్రిక కెటిఆర్కు పట్టణాభిషేకం అనే శీర్షిక పెట్టగా, నమస్తే తెలంగాణలో మాత్రం కెటిఆర్కు అదనపు శాఖ అనే శీర్షిక పెట్టారు. దీనిపై కెటీఆర్ నమస్తే తెలంగాణ సంపాదక బృందంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
పత్రికపై కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధ...
నమస్తే తెలంగాణ పత్రికపై కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తారు. ఆయన ప్రతి రోజూ పత్రికను ఆసాంతం చదివి, మంచీచెడులను బేరీజు వేసి, సంపాదకుడికి విషయాలు చెబుతారని అంటారు. ఎక్కడ బాగా లేదు, ఎక్కడ బాగుందని అని చెప్తారని అంటారు. ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఆయన ఆ పని చేస్తుంటారని సమాచారం. ఆయనకు పత్రికపై ఎనలేని ప్రేమానురాగాల కారణంగానే కాకుండా తెలంగాణలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఆయన ఈ పనిచేస్తుంటారని అంటారు.
కెసిఆర్ ఇలా చేశారు....
పత్రికా సంపాదకవర్గం పట్ల అసంతృప్తితో కెసిఆర్ కొన్ని మార్పులూ చేర్పులూ చేసినట్లు చెబుతారు. ఎడిటోరియల్ వ్యవహారాలను చూసుకునేందుకు ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక నుంచి ఓ వ్యక్తిని రప్పించి ఉన్నత స్థానంలో పెట్టారని చెబుతారు. ఆయన పత్రికలోని అన్ని సెక్షన్ల రోజు వారీ వ్యవహారాలను చూస్తున్నట్లు సమాచారం.
కోదండరామ్ వ్యతిరేకతను ఇలా...
తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్తో పాటు తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ ధీటైన పాత్ర పోషించారు. తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనను కెసిఆర్ దూరం పెట్టారనే విమర్శ ఉంది. ఈ స్థితిలోనే కోదండరామ్ తెలంగాణలోని వివిధ సమస్యలపై పోరాటం చేస్తూ వస్తున్నారు. ఆయన తలపెట్టిన నిరుద్యోగుల ర్యాలీ ప్రభుత్వానికి ఒక రకంగా కొరకరాని కొయ్యగానే మారింది. ఆయనను అరెస్టు చేయడం వివాదంగా మారింది. ఈ విషయంలో నమస్తే తెలంగాణ సరైన పాత్ర పోషించలేదనే అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తోంది.
టీచర్ల పట్ల ఇలా....
కొన్ని సందర్భాల్లో నమస్తే తెలంగాణ సంపాదకవర్గం, బ్యూరో సరైన పాత్ర పోషించ లేదనే అభిప్రాయం కెసిఆర్కే కాకుండా కెటిఆర్కు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. టీచర్లను అవమానిస్తూ రాసిన ఓ వార్తాకథనం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు వేసిన నోటా ఓట్లను తప్పుగా లెక్కిస్తూ వార్తాకథనం పత్రికలో వచ్చింది. నోటా ఓట్లతో పాటు ఎలిమినేట్ అయిన అభ్యర్థి ఓట్లను కూడా లెక్కలోకి తీసుకుని టీచర్లకు ఈ మాత్రం కూడా తెలియదనే పద్ధతిలో నమస్తే తెలంగాణలో వార్తాకథనం ప్రచురితమైంది. దీంతో ఉపాధ్యాయవర్గాల్లో తీవ్రమైన అసంతృప్తి చోటు చేసుకున్నట్లు చెబుతారు. టీచర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారితే ఏర్పడే ప్రమాదం తెలియంది కాదు. అది ఎన్నికల్లో అధికారాన్ని తలకిందులు చేసేంతగా ఉంటుంది.
అప్పుడు ఆ బ్లండర్ ఇలా...
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, కెసిఆర్కు గౌరవానికి పాత్రుడైన జయశంకర్ వర్ధంతిని నమస్తే తెలంగాణ పత్రిక నామమాత్రంగానైనా ప్రస్తావించకపోవడం అప్పట్లో తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ సంఘటనపై సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది. దాంతో నమస్తే తెలంగాణ సంపాదక వర్గం దిగి వచ్చి విచారం వ్యక్తం చేయాల్సి వచ్చింది. ఎన్నారైలు, కెసిఆర్ అభిమానులు కూడా నమస్తే తెలంగాణ తీరుకు మనసు నొచ్చుకున్నారు.
సమస్యల పట్ల ఇలా...
తెలంగాణలో సమస్యలను ఆసరా చేసుకుని ప్రతిపక్షాలు ఆందోళనలకు దిగుతూ ప్రజలను కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. మల్లన్నసాగర్, గ్రూప్ పరీక్షలు, సింగరేణి సమస్య వంటివాటి విషయాల్లో అసలు కోణాన్ని పట్టుకుని ప్రజలకు వాస్తవాలను తెలియజెప్పే కృషిలో నమస్తే తెలంగాణ పత్రిక విఫలమైందనే అభిప్రాయం ఉంది. ఎడిట్ పేజీలో కెసిఆర్ను హేతురహిత వ్యాఖ్యలతో ఆకాశానికెత్తే వ్యాసాల పరంపరకు ప్రాధాన్యం దక్కుతుందనే అభిప్రాయం ఉంది. కెసిఆర్ను ప్రశంసిస్తూ రెండో మూడో ఎడిట్ పేజీ వ్యాసాలను అచ్చేయించుకుంటే పదవులు వస్తున్నాయనే ప్రచారం కూడా ఉంది.
అంధ్ర యాజమాన్యంలోని పత్రికలు ఇలా...
బలమైన ఆంధ్ర యాజమాన్యంలోని పత్రికలు తమ ప్రభుత్వ కార్యక్రమాలను, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ వార్తాకథనాలను, వార్తలను ఇస్తుంటే నమస్తే తెలంగాణలో మాత్రం అంత పకడ్బందీగా రావడం లేదనే అభిప్రాయం ఉంది. వాటికి ధీటుగా తయారు కావడంలో నమస్తే తెలంగాణ విఫలమైందనే ప్రచారం కూడా ఉంది. అందువల్లనే కెటిఆర్ జోక్యం చేసుకున్నట్లు చెబుతారు.
చేతులు మారడానికీ చరిత్ర...
నమస్తే తెలంగాణ యాజమాన్యం లక్ష్మీరాజం చేతుల నుంచి కెసిఆర్ చేతుల్లోకి రావడానికి కూడా ఓ కారణం ఉందని అంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత లక్ష్మీరాజం యాజమాన్యంలోని నమస్తే తెలంగాణ కాంగ్రెసుకు అనుకూలంగా మారిందనే అభిప్రాయం ఉంది. ఇందులో భాగంగానే సంపాదకుడు మారినట్లు చెబుతారు. అప్పుడు పత్రిక సంపాదకవర్గంలో చోటు చేసుకున్న అంతర్గత విభేదాల కారణంగానే పత్రిక నిర్వహణ బాధ్యతలు మారాయని చెబుతారు.