కాంగ్రెస్ నేతలు టూరిస్ట్లు, డీఐజీతో నేరేళ్ళ ఘటనపై విచారణ: కెటిఆర్
నేరేళ్ళ ఇసుక లారీల దహనం కేసు బాధితులను తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం నాడు పరామర్శించారు. ఈ కేసులో ఇటీవలే జైలు నుండి విడుదలైన 8 మంది వేములవాడలోని మనోహర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న
రాజన్న సిరిసిల్ల: నేరేళ్ళ ఇసుక లారీల దహనం కేసు బాధితులను తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం నాడు పరామర్శించారు. ఈ కేసులో ఇటీవలే జైలు నుండి విడుదలైన 8 మంది వేములవాడలోని మనోహర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మంగళవారం నాడు ఉదయం కెటిఆర్ వేములవాడకు చేరుకొని బాధితులను పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకొన్నారు. మెరుగైన వైద్యం అందించాలని మంత్రి వైద్యులకు సూచించారు.
నేరేళ్ళ ఘటన బాధాకరమన్నారు మంత్రి కెటిఆర్, ఇసుక మాఫియాను ప్రభుత్వం ప్రోత్సహించబోదని చెప్పారు. టిఆర్ఎస్ మూడేళ్ళ పాలనలో ఇసుక ద్వారా వెయ్యికోట్ల ఆదాయం వచ్చిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే ఇసుకదందా సాగిందని కెటిఆర్ ఆరోపించారు.బాధితులను పరామర్శించకుండా కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరైందికాదన్నారు.
కాంగ్రెస్ పార్టీ తిట్లను దీవెనలుగా భావిస్తామన్నారు. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ది కోసమే ఆరోపణలు చేస్తున్నాయని కెటిఆర్ మండిపడ్డారు.
మిడ్మానేర్లో 10 టిఎంసిల నీరు నింపాలనే లక్ష్యంతోనే ఇసుకను తీస్తున్నామని స్పష్టం చేశారు. పలు రాజకీయపార్టీలు తమ స్వప్రయోజనాల కోసం నేరేళ్ళ ఘటనను వాడుకొంటున్నాయని ధ్వజమెత్తారు.
ఈ ఘటనపై డీఐజీ విచారణ నిర్వహించనున్నారని, ఈ విచారణలో బాధ్యులు ఎవరో తేలుతాయన్నారు. బాధ్యులపై చర్యలను తీసుకొంటామన్నారు. మీడియా కూడ ఈ రకమైన విషయాల్లో సంయమనాన్ని పాటించాలని ఆయన కోరారు.
సిరిసిల్ల ప్రజలకు తనను దూరం చేయలేరని కెటిఆర్ చెప్పారు. తనకు, ప్రజలకు మధ్య దూరం పెంచేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు టూరిస్టులు మాత్రమేనని చెప్పారు. నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొనేది తానేనని చెప్పారు. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతోనే మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు.