నిన్న ఎర్రబెల్లి.. నేడు కొప్పుల.. యువరాజే తదుపరి సీఎం..? స్వరం కలుపుతోన్న మంత్రులు..
తెలంగాణ రాష్ట్ర తదుపరి సీఎం ఎవరు..? కేసీఆర్ రాజకీయ వారసత్వం ఎవరూ పునికిపుచ్చుకోబోతున్నారు. రేసు లేదు, పేర్లు కూడా లేవు. కానీ తదుపరి సీఎం కేటీఆర్ అని మాత్రం జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిని టీఆర్ఎస్ పార్టీ ఖండిస్తోన్నా.. ఊహాగానాలు ఎక్కువవడంతో ఏం జరగుతుందనే చర్చకు దారితీసింది. శనివారం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ పార్టీ ముఖ్యులతో సమావేశంలో కూడా తదుపరి సీఎం గురించి పార్టీ నేతలు చెవులు కొరుక్కున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇంతకీ కేసీఆర్ తన రాజకీయ వారసుడిని ప్రకటించబోతున్నారా..? అయితే ఎప్పుడు..?
కేసీఆరే సీఎం..
సీఎం రేసులో లేనని, మరో పదేళ్లు కేసీఆర్ సీఎంగా ఉంటారని.. ప్రతీ సభలోనూ మంత్రి కేటీఆర్ ప్రస్తావిస్తున్నారు. కానీ ఊహాగానాలు మాత్రం గుప్పుమనడం ఒక ఎత్తైతే.. మంత్రులు కూడా కామెంట్లు చేయడం ప్రాధాన్యాం సంతరించుకుంది. ఇటీవల ఎర్రబెల్లి దయాకర్ రావు తదుపరి సీఎం కేటీఆర్ అని కామెంట్ చేశారు. కేసీఆర్ తర్వాత సీఎం అయ్యే అర్హత ఒక్క కేటీఆర్కు మాత్రమే ఉందని ఢంకా బజాయించి మరీ చెప్పారు. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా సమర్థవంతంగా పనిచేస్తున్నారని గుర్తుచేశారు.
మంత్రి ఎర్రబెల్లి
అంతేకాదు కేటీఆర్ డైనమిక్ లీడర్ అని కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేసీఆర్ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగిడిన.. తనకంటూ ఇమేజ్ సెట్ చేసుకున్నారని పేర్కొన్నారు. అదే మిగతా పార్టీ నేతలు అలా కాదని లోకేశ్, రాహుల్ గాంధీని ఎర్రబెల్లి దయాకర్ రావు ఉదహరించారు. కేటీఆర్తో నారా లోకేశ్, రాహుల్ గాంధీ ఏ విషయంలోనూ పోటీపడరని తేల్చిచెప్పారు.
స్వరం కలిపిన కొప్పుల
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాదన ఇలా ఉంటే.. మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా స్వరం కలిపారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి పదవీ చేపట్టాలని కోరుకుంటున్నాని తన మనసులోని మాటను బయటపెట్టారు. కేసీఆర్కు తగ్గ తనయుడు కేటీఆర్ అని కొప్పుల ఈశ్వర్ గుర్తుచేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం.. తదితర అంశాలు అనుకొని ఐదేళ్లలో సీఎం కేసీఆర్ పూర్తిచేశారని చెప్పారు.
డైనమిక్ లీడర్
యువ నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే సంతోషమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో నిలిపేందుకు కేటీఆర్ శక్తివంచన లేకుండా కృషిచేస్తారని అభిప్రాయపడ్డారు. కానీ కేటీఆర్ను సీఎం ఎప్పుడు చేస్తారనే అంశం కేసీఆర్ నిర్ణయం మేరకు ఆధారపడి ఉంటుందని చెప్పారు. అదీ సమయానుకూలంగా పార్టీ వెల్లడిస్తోందని చెప్పారు. సీఎం మార్పు, కొత్త ముఖ్యమంత్రి నియామక పార్టీ అంతర్గత విషయమని కొప్పుల ఈశ్వర్ స్పష్టంచేశారు. దీనిపై బీజేపీ లక్ష్మణ్కు ఎందుకు కడుపుమంట అని మండిపడ్డారు.