'నా హీరోకు హ్యాపీ బర్త్ డే': తల్లి చంకలో కెటిఆర్, ట్విట్టర్లో పోస్ట్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 62వ పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ట్విట్టర్లో పోస్టు చేశారు. 'నాకు స్ఫూర్తి మా నాన్నే. ఆయనే నా నాయకుడు, హీరో. గొప్ప తండ్రి. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు' అని మంత్రి కేటీఆర్ బుధవారం తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొన్ని అరుదైన ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారంతో 63వ వసంతంలో అడుగుపెట్టారు. ఆయన 1954 ఫిబ్రవరి 17న జన్మించారు. రాష్ట్రంలోని పలుచోట్ల కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కార్యకర్తలు, అభిమానులు ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ ఉద్యమ రథసారథిగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఘనతను సాధించారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్రావు, సీఎస్ రాజీవ్శర్మ, డీజీపీ అనురాగ్శర్మ తదితరలు కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
మరోవైపు పంజాగుట్ట ఎమ్మెల్యే క్వార్టర్స్లో నిర్వహించే వేడుకల్లో మంత్రి మహేందర్రెడ్డి, పార్టీనేతలు పాల్గొనున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో నగర మంత్రులు, మేయర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
To my leader, my hero & my inspiration. To a fabulous Dad; Happy, Healthy and a wonderful Birthday pic.twitter.com/0wnNBSzxuI
— KTR (@KTRTRS) February 17, 2016
ఇదిలా ఉంటే రాజ్భవన్ ఉద్యోగుల క్వార్టర్స్, పాఠశాల, కమ్యూనిటీహాలు నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ సోమాజిగూడలోని రాజ్భవన్ను అనుకుని ఉన్న స్థలంలో ఈ నిర్మాణాలను చేపడుతున్నారు.
రాజ్భవన్లో పనిచేసే ఉద్యోగుల నివాసానికి 185 ప్లాట్లతో పాటు, 500 మంది విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా పాఠశాల భవనం నిర్మించనున్నారు. ఈ నిర్మాణాల కోసం రూ.95.50 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. 2017 అక్టోబర్ నాటికి నిర్మాణాలు పూర్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించారు.
ఈ శంకుస్థాపన కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులతో పాటు రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్రావు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. భూమి పూజ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.