సిరిసిల్లను అభివృద్ధి చేసి నా రుణం తీర్చుకుంటా: కేటీఆర్ బహిరంగ లేఖ
హైదరాబాద్: రాజకీయాల్లో ఉన్నంత కాలం సిరిసిల్ల నియోజకవర్గం నుంచే కొనసాగుతానని, ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసి తన రుణాన్ని తీర్చుకుంటానని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తాను నియోజకవర్గం మారుతున్నానంటూ వస్తున్న వార్తలు దుష్ప్రచారమేనని ఆయన చెప్పారు.
సిరిసిల్లను జిల్లా చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు కేటీఆర్ ఒక బహిరంగ లేఖ రాశారు. సిరిసిల్ల నియోజకవర్గం జిల్లా అయితే ఎంత అభివృద్ధి చెందుతుందో అంతకన్నా రెట్టింపు అభివృద్ధి చేస్తానని వెల్లడించారు.
'యువకుడిగా తెలంగాణ ఉద్యమానికి నడుం కట్టిన నాకు.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిపించి.. రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు నేను గానీ, టీఆర్ఎస్ పార్టీగాని గత ఎన్నికల్లో గానీ, మ్యానిఫెస్టోలో గానీ జిల్లా ఏర్పాటు చేస్తామని ఎలాంటి వాగ్దానం చేయలేదు...' అని ఆ లేఖలో ప్రస్తావించారు.
ముసాయిదాలో పేరు లేకపోవడం ప్రజలను నిరుత్సాహపరిచిందని, వాస్తవిక అంశాలతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాధిస్తే అర్ధం చేసుకోవాలని కోరుతున్నానన్నారు. జిల్లా ఏర్పాటు శాస్త్రీయంగా, హేతుబద్దతతో ప్రమాణాల మేరకే జిల్లా కేంద్రాలు ఏర్పాటవుతాయని వివరించారు.
జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి కోసం ప్రతిపాదించామని, ఇపుడు అంతకు మించి అభివృద్ధి చేస్తానన్నారు. సిరిసిల్ల నుంచి ప్రభుత్వ కార్యాలయాలు తరలిపోతాయన్నది దుష్ప్రచారమేనని, డివిజన్ కార్యాలయాలు, సబ్కోర్టు, సెస్ కార్యాలయం అక్కడే కొనసాగుతాయని చెప్పారు. సిరిసిల్లలో మరిన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో అగ్రశ్రేణి నియోజకవర్గంగా సిరిసిల్లను తీర్చి దిద్దుతానని హామీ ఇచ్చారు. సిరిసిల్లను జిల్లా ఏర్పాటుకు మేనిఫెస్టోలో వాగ్దానం చేయనప్పటికీ తాను, చెన్నమనేని రమేష్ లాంటి వాళ్లం జిల్లా ప్రతిపాదనను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు.
కానీ ప్రభుత్వం శాస్త్రీయంగా, హేతుబద్దతతో కొన్ని ప్రమాణాలను పరిగణలోకి తీసుకుని జిల్లా కేంద్రాల ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పరిశీలించి ఆగస్టు 22న వెలువరించిన ముసాయిదాలో సిరిసిల్ల పేరు చేర్చలేదనేది వాస్తవమని, ఈ విషయం నియోజకవర్గం ప్రజలకు నిరుత్సాహానికి గురిచేసిన మాట వాస్తవమన్నారు.
జిల్లా కోసం ఎలాంటీ హామీ ఇవ్వనుకున్నా నియోజకవర్గం సర్వతో ముఖాభివృద్దికి కృషి కోసం ప్రయత్నించానని వివరించారు. కొత్త జిల్లాల ప్రతిపాదనలు తెచ్చినపుడు, కొడుక్కో జిల్లా, బిడ్డకో జిల్లా, అల్లుడికో జిల్లా అంటూ విమర్శలు వచ్చిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
సిరిసిల్ల ప్రజలకు తనకు మధ్య అగథాన్ని సృష్టించేందుకు కొన్ని దుష్ట శక్తులు చేస్తోన్న ప్రయత్నాలను నియోజకవర్గం ప్రజలు గుర్తించాలన్నారు. మనమంతా కలిసి సిరిసిల్ల సర్వతోముఖాభివృద్దికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఇన్నాళ్లు తనను సోదరునిగా భావిస్తూ ముందుకు నడిపిస్తున్న నియోజకవర్గ వాసులకు కృతజ్ఞతలు తెలిపారు.