కూకట్ పల్లి ఓటర్లు టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారా ? షాకిస్తారా ?
తెలంగాణా రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది . 61 శాతం పోలింగ్ నమోదైంది . చాలా తక్కువ పోలింగ్ శాతం నమోదైనా ఎన్నికల నిర్వహణ చాలా ప్రశాంతంగా జరిగింది. అయితే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ కు స్పష్టమైన మెజార్టీ ఇచ్చిన తెలంగాణా ప్రజలు ఈ దఫా కూడా అలాగే ఆదరిస్తారా ? కూకట్ పల్లి వంటి ఆంధ్రా ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారు. ఆంధ్రాలో తలెత్తిన రాజకీయ పరిణామాలు, తెలంగాణాలోని టీఆర్ఎస్ పార్టీ ఆంధ్రా ఎన్నికలపై చూపించే ప్రభావం వంటి పలు కారణాల నేపధ్యంలో ఆంధ్రా ఓటర్లు టీఆర్ఎస్ ను ఆదరించారా ? లేదా టీఆర్ఎస్ కు ఝలక్ ఇచ్చారా? అన్నది రాజకీయవర్గాల్లో చర్చకు కారణం అవుతుంది.
కూకట్పల్లి ఓటర్ల తీర్పు ఎప్పుడూ విలక్షణమే
ప్రతీసారి కూకట్ పల్లిలో ఓటర్లు విలక్షణ తీర్పునిస్తున్నారు. ఆంధ్ర సెటిలర్లు గెలుపును ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి అక్కడి ప్రజలపై రాజకీయ పార్టీలది ప్రత్యేకమైన దృష్టి . తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూకట్ పల్లి నియోజకవర్గం మొత్తం రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయా
నందమూరి సుహాసినికి టిడిపి సీటు ఇవ్వడంతో అక్కడ సుహాసిని గెలుస్తుంది అని అంతా భావించారు. కానీ అనూహ్యంగా టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు అక్కడి ప్రజలు ముఖ్యంగా ఆంధ్రా ఓటర్లు . ఆ తరువాత లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ తెలంగాణలో పోటీలో లేదు. దాంతో కాంగ్రెస్ పార్టీ నుండి మల్కాజ్ గిరి అభ్యర్థిగా రంగంలోకి దిగారు రేవంత్ రెడ్డి . మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూకట్ పల్లిది ప్రత్యేకమైన స్థానం . ఇక్కడ నుండి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని రంగంలోకి దించింది టీఆర్ఎస్ పార్టీ .
కూకట్పల్లి ఓటర్లు టీఆర్ఎస్ ను ఆదరిస్తారా ? షాక్ ఇస్తారా
రాజశేఖర్ రెడ్డి రాజకీయాలకు కొత్త కావటం , ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు లేకపోవటం , రేవంత్ రెడ్డి అందరికీ తెలిసిన నేత కావటం , గత ఎన్నికల్లో ఓటమి పాలైన సానుభూతి కాస్తో కూస్తో వర్కవుట్ అయ్యే అవకాశం వెరసి కాంగ్రెస్ పార్టీ వైపు కూకట్పల్లి ఆంధ్రా ఓటర్లు మొగ్గు చూపారు అన్న టాక్ వినిపిస్తుంది. హైదరాబాద్లో వేసిన ఓటింగ్ శాతంలో 39 శాతం కూకట్పల్లి లోనే భారీగా నమోదైంది. ఇక కూకట్ పల్లి వాసులు కాంగ్రెస్ ను ఆదరిస్తే మల్కాజ్ గిరి సీటు కాంగ్రెస్ ఖాతాలో పడుతుంది. రాష్ట్రంలో అన్ని లోక్ సభ స్థానాలు తమ ఖాతాలోనే వేసుకోవాలని వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళిన టీఆర్ఎస్ పార్టీకి ఝలక్ ఇచ్చినట్టు అవుతుంది . చూడాలి మరి కూకట్ పల్లి ఆంధ్రా ఓటర్ల తీర్పు ఈసారి ఎలా ఉండనుందో ?