సనత్ నగర్ వాకిట్లో త్యాగాల వెంకటేష్..! పాపం కూన..!
హైదరాబాద్ : రాజకీయాల్లో శాపగ్రస్త నాయకులు కూడా ఉంటారు. అన్నీ అనుకూలంగా ఉంటూ అదిష్టానం తలలో నాలుకగా వ్యవహరిస్తున్నప్పటికి కొన్ని సందర్బాల్లో ఎదురుదెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఐదు సంవత్సరాలు నియోజకవర్గంలో అనేక సేవలు చేస్తూ ప్రజాధరణ సంపాదించుకున్నప్పటికి చివరినిమిషంలో సీటు వేరే వాళ్లు తన్నుకుని పోవచ్చు. అలాంటి సందర్బాలు తెలుగుదేశం పార్టీలో ఓ నేతకు సర్వసాధారణంగా మారింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ తురుపున కూకట్ పల్లి నుండి పోటీ చేసి ఓడిపోయిన ఆనేత తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి చురుకైన నాయకుడిగా ఎదిగారు. 2014లో సనత్ నగర్ సనత్ నగర్ నియోజకవర్గం నుండి దాదాపు పోటీ ఖాయమని భావించిన తరుణంలో తలసాని శ్రీనివాస యాదవ్ ఆ సీటును ఎగరేసుకుపోయారు. తాజాగా అదే సనత్ నగర్ సీటును కావాలనుకుంటున్న సదరు నేతకు మళ్లీ చుక్కెదురౌతోంది. మహాకూటమి పొత్తులో భాగంగా సనత్ నగర్ టికెట్ కాంగ్రెస్ కి కేటాయించడంతో ఆ నాయకుడు అయోమయానికి గురౌతున్నట్టు తెలుస్తోంది. దీంతో అదిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు ఆ నేత సిద్దమైనట్టు సమాచారం..! ఇంతకీ ఎవరా నేత..? ఏంటా కథ..? తెలుసుకుందాం..!!
తెలంగాణలో వేడెక్కిన రాజకీయం..! ఆశావహుల అసహనం..!!
తెలంగాణలో ముందస్తు ఎన్నిక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఒకపక్క టీఆర్ఎస్, మరోపక్క మహాకూటమి వేస్తున్న ఎత్తులు ఈ ఎన్నికలపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. టీఆర్ఎస్ను అదికారంలోకి రాకుండా చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐ కలిసి మహాకూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కూటమి ఏర్పడి చాలా కాలమే అయినా సీట్ల పంపకాలపై ఇంకా గందరగోళమే నడుస్తోంది. ఏ స్థానం ఎవరికి దక్కుతుందో తేలకపోవడం, కుదిరిన పొత్తులంటూ లీక్లు వస్తుండడంతో మిత్రపక్షంలోని ఆశావహుల్లో అయోమయం మొదలవుతోంది.
కూటమిలో కొట్లాట తప్పేలా లేదు..! ఎలా బుజ్జగిస్తారో చూడాలి..!!
మహాకూటమి తరుఫున పోటీ చేసేందుకు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ నుంచి అనేకమంది పోటీ పడుతున్నారు. కొన్ని స్థానాలను తమకంటే తమకు కేటాయించాలని ఆ రెండు పార్టీల నేతలు అధిష్ఠానాలను కోరుతున్నారు. అయితే, సీట్లు కోరడం విషయంలో టీడీపీ అవలంభిస్తున్న వైఖరి కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీనిపై ఆ పార్టీకి చెందిన నేత అధిష్ఠానం పట్ల ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. సీటు తనకు కేటాయించకపోతే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా తెలుస్తోంది.
సనత్ నగర్ టీడిపి రాకపోతే రచ్చరచ్చే..! మళ్లీ త్యాగం చేసేంత ఓపిక లేదంటున్న కూన..!!
టీడీపీ సీనియర్ నేత కూన వెంకటేష్ గౌడ్ టికెట్ కేటాయింపు విషయంలో అధిష్ఠానం పట్ల అసంతృప్తితో ఉన్నారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. 2014 ఎన్నికల్లో ఆయన సనత్నగర్ నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే, అక్కడి నుంచి తలసాని శ్రీనివాస్యాదవ్కు టికెట్ ఇచ్చి, కూనను సికింద్రాబాద్కు పంపింది టీడీపీ అధిష్ఠానం. ఏ మాత్రం పరిచయం లేని సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి టి. పద్మారావు చేతిలో ఓడిపోయారు. అప్పటి నుండి మళ్లి వెనక్కు వచ్చి సనత్ నగర్ నియోజక వర్గంలో తనపని తాను చేసుకుంటూ ప్రజలకు దగ్గరయ్యరు కూన.
కూటమిలో టెన్షన్ రేకెత్తుస్తున్న సనత్ నగర్..! ఇరకాటంలో అదిష్టానం..!!
తర్వాత తలసాని టీఆర్ఎస్లో చేరిపోవడంతో, కూన మళ్లీ సనత్నగర్ను తన కార్యక్షేత్రంగా మార్చుకొని ముందుకు వెళ్తున్నారు. పార్టీని బలోపేతం చేస్తూ, కేడర్కు అండగా ఉన్నారు. అంతా సవ్యంగా సాగుతోందనుకుంటున్న తరుణంలో మళ్లీ కుదుపు మొదలైంది. పొత్తు ధర్మంలో భాగంగా సనత్ నగర్ సీటు కాంగ్రెస్ కి కేటాయించిట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో టికెట్ తనకు దక్కుతుందా లేదా అనే ఆందోళనలో పడిపోయారు కూన. ఒకవేళ ఈ సారి పొత్తులో భాగంగా సనత్నగర్ను టీడీపీ దక్కించుకోకపోయినా, తనకు టికెట్ ఇవ్వకపోయినా సహించే ప్రసక్తే లేదని చెబుతున్నారు కూన వెంకటేష్. ఈ మేరకు ఆయన టీటీడీపీ నేతలకు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరి టీడిపి అదిష్టానం ఈ వ్యవహారాన్ని ఎలా తీసుకుంటుందో చూడాలి..!