జస్ట్ లక్ష కోసం ఇంత కష్టపడ్డారా ? బస్సు దొంగల వెరైటీ స్టోరీ !
హైదరాబాద్: మహాత్మాగాంధీ సెంట్రల్ బస్ స్టేషన్ లో నైట్ హాల్ట్ లో ఉంచిన సిటీ బస్సును ఎత్తుకెళ్లిన దొంగలు.. దాన్ని తుక్కు సామాన్ల వ్యాపారికి లక్ష రూపాయలకు అమ్మేశారు. దీనికోసం వారు ముందే ఆ వ్యాపారితో బేరం కుదుర్చుకున్నారని, 60 వేల రూపాయలను అడ్వాన్స్ గా కూడా తీసుకున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో మొత్తం ఎనిమిదిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. మరొకరు పరారీలో ఉన్నారని చెప్పారు. త్వరలోనే అతణ్ని కూడా అరెస్టు చేస్తామని అన్నారు. నిందితుల నుంచి 19,500 రూపాయల నగదు, కొన్ని బస్సు విడిభాగాలతో పాటు ఓ బైక్, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
సిబ్బందికి నోటీసులు..
ఈ నెల 24వ తేదీ రాత్రి ఎంజీబీఎస్ లో నైట్ హాల్ట్ లో ఉంచిన సిటీ బస్సును ఇద్దరు పాత నేరస్తులు చోరీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఆర్టీసీ అధికారుల్లో కలవరాన్ని పుట్టించింది. రవాణాశాఖ మంత్రి రవాణా శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుల ఆచూకీని గుర్తించాలని ఆదేశించారు. కనీస జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందికి నోటీసులను జారీ చేశారు. ఈ ఉదంతంలో గ్రేటర్ హైదరాబాద్ జోన్ అధికారులు కుషాయిగూడ డిపో మేనేజర్ సహా పలువురికి షోకాజ్ నోటీసులను జారీ చేసినట్లు తెలుస్తోంది.
అన్నదమ్ములు..తోడుదొంగలు..
సిటీ బస్సును చోరీ చేసినది పాత నేరస్తులేనని తేలింది. సికింద్రాబాద్ సమీపంలోని జామై ఉస్మానియా ప్రాంతంలో నివాసం ఉండే అబేద్, జహేద్ బస్సును మాయం చేశారని పోలీసులు గుర్తించారు. పలు కేసుల్లో వారు కారాగార శిక్షను అనుభవించారని, అయినప్పటికీ.. తమ వైఖరిని మార్చుకోలేదని పోలీసుల దర్యాప్తులో స్పష్టమైంది. అయిదేళ్లుగా ఆటో నడిపిస్తూ జీవితాన్ని గడిపే వారని పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. మద్యానికి బానిసలు కావడం, జల్సాలకు అలవాటు పడటం వల్ల దొంగతనాలకు పాల్పడేవారని అన్నారు. అబేద్ ఒక్కడే తొమ్మిది ఇళ్లల్లో దొంగతనాలు చేశాడని, సోదరునితో కలిసి గత ఏడాది ఏడు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారని చెప్పారు. మూడేళ్ల కిందట మలక్ పేట్ పోలీసులు అబేద్పై పీడీ చట్టాన్ని కూడా ప్రయోగించారు.
హైదరాబాద్ టు నాందెడ్: 8 గంటల్లో ప్రయాణం..
జైలు నుంచి కొద్దిరోజుల కిందటే విడుదలైన అబేద్, జహేద్ తమ వైఖరిని మార్చుకోలేదు. జైలు నుంచి విడుదలైన తరువాత కూడా చిన్న, చిన్న చోరీలు చేశారు. పోలీసులు నిఘా ఉంచడంతో మహారాష్ట్రలోని నాందెడ్ కు వెళ్లిపోయారు. తమ బంధువుల ఇంట్లో ఉంటూ, ఉపాధి మార్గాలను అన్వేషించసాగారు. వారి బంధువు నవీద్ కు తుక్కు సామాన్ల దుకాణం ఉంది. అక్కడే వారికి బస్సును దొంగిలించాలని ఆలోచన కలిగింది. నవీద్ తో ముందుగానే బేరం కుదుర్చుకున్నారు. బస్సును తీసుకొస్తే.. లక్ష రూపాయలు ఇవ్వడానికి నవీద్ అంగీకరించాడు. మంగళవారం రోజు రాత్రి ఎంజీబీఎస్ కు చేరుకుని, అక్కడ పార్క్ చేసి ఉంచిన మెట్రో సిటీ ఎక్స్ ప్రెస్ బస్సును ఎత్తుకెళ్లారు. కేవలం ఎనిమిది గంటల్లో నాందెడ్ కు చేరుకున్నారు. నేరుగా నవీద్ దుకాణం వద్ద బస్సును నిలిపేశారు. క్షణాల్లో బస్సు విడి భాగాలను తొలగించారు. అసలు ఆనవాళ్లే లేకుండా చేశారు. అడ్వాన్స్ కింద 60 వేల రూపాయలను నవీద్ నుంచి తీసుకున్న అబేద్, జహేద్ మళ్లీ హైదరాబాద్ కు వచ్చి జల్సా చేశారని అంజనీకుమార్ చెప్పారు.
ఎనిమిది మంది అరెస్ట్..
అబేద్ జహేద్ లతో పాటు బస్సు విడిభాగాలను తొలగించిన నవీద్, మహమ్మద్, జుబేర్, ఒమర్, సయ్యద్ సల్మాన్, మహమ్మద్ షఫీక్, కలీమ్ లను అరెస్టు చేశామని, ఫరూక్ అనే మరో వ్యక్తిని అరెస్టు చేయాల్సి ఉందని అన్నారు. అతను పరారీలో ఉన్నాడని, పోలీసులు గాలిస్తున్నారని అంజనీకుమార్ చెప్పారు.