కెసిఆర్ ఇంటి ముందు చెత్త వేయిస్తాం: రమణ, బంద్పై నాగం
హైదరాబాద్: మంత్రివర్గ సమావేశంలో జీహెచ్ఎంసీ కార్మికుల జీతాల పెంపుపై నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఇంటి ముందు చెత్త వేయిస్తామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎల్.రమణ హెచ్చరించారు.
ఇందిరాపార్క్ దగ్గర జరిగిన జీహెచ్ఎంసీ కార్మికుల మహా ధర్నాలో రమణ పాల్గొని వారికి మద్దతు తెలిపారు. కార్మిక మంత్రి, నేత అయిన నాయిని కార్మికుల పొట్టకొడుతున్నారని రమణ ఆరోపించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ప్రతిపక్షాల నేతలు పాల్గొన్నారు. కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు కూడా కార్మికులను ఉద్దేశించి ప్రసంగిచారు.
ఇదిలావుంటే, రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులు నత్త నడకన సాగుతున్నాయని బిజెపి తెలంగాణ నేత నాగం జనార్థన్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్ట్లపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడాన్ని నిరసిస్తూ అధికార టీఆర్ఎస్ నేతలు మహబూబ్నగర్ జిల్లాలో మాత్రమే బంద్కు ఎందుకు పిలుపునిచ్చారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. మిషన్కాకతీయ కమీషన్ కాకతీయగా మారిందని దుయ్యబట్టారు. వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని నాగం ఉద్ఘాటించారు.