భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్: ఏప్రిల్ నుంచి అర్థరాత్రి కూడా మెట్రో సేవలు
హైదరాబాద్: ఉదయం, సాయంకాలం వేళలతో పోలిస్తే రాత్రిపూట మెట్రో రైలు చివరి ట్రిప్లకు డిమాండ్ అధికంగా ఉండటంతో ఏప్రిల్ నుంచి వారాంతాల్లో అర్ధరాత్రి వరకు సర్వీసులు పొడిగించే ఆలోచన చేస్తోంది ఎల్ అండ్ టీ మెట్రో. ఉదయం 6 గంటలకు కాకుండా 6.30 గంటలకు మొదలెట్టి రాత్రిపూట ఆ మేరకు సమయాన్ని పొడిగించాలనే యోచిస్తోంది. మొదట్లో వారాంతాల్లో మొదలెట్టి మిగతా రోజులకు విస్తరించేలా ప్రణాళిక రూపొందిస్తున్నది.
ప్రస్తుతం మెట్రోరైళ్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు.. మియాపూర్ - అమీర్పేట, నాగోల్ - అమీర్పేట వరకు రెండు మార్గాల్లో తిరుగుతున్నాయి. రాత్రిపూట చివరి మెట్రోరైళ్లలో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారని ఎల్ అండ్ టీ అధికారులు అంటున్నారు. రాత్రి 10 దాటితే పెద్దగా బస్సులు లేకపోవడం ఆటో డ్రైవర్లు అధిక ఛార్జీలు డిమాండ్ చేస్తుండటంతో ఆ సమయంలో ప్రయాణికులు మెట్రోవైపు చూస్తున్నారు. మెట్రోస్టేషన్లలో సమయ పాలన మేరకు చివరి రైలును ఎక్కువగా అందుకుంటున్నారు.
రాత్రి సర్వీసుల్లోనూ ప్రయాణికుల డిమాండ్ ఇలా
నాగోల్లో రాత్రి 10 గంటలకు చివరి మెట్రో బయలుదేరితే అమీర్పేట వరకు 40 నిమిషాల్లో అంటే 10.40కి చేరుకుంటోంది. ఈ మధ్యలో 12 స్టేషన్లు ఉన్నాయి. ఆ ప్రకారం సమయం చూసుకుని ప్రయాణికులు చివరి మెట్రో సర్వీసును అందుకుంటున్నారు. అమీర్పేట నుంచి నాగోల్ వైపు చివరి మెట్రో రాత్రి 10.42 గంటలకు ఉంది. సికింద్రాబాద్ స్టేషన్కు 11.02 గంటలకు, నాగోల్కు 11.25 గంటలకు చేరుకుంటుంది. రాత్రి 10 గంటల తర్వాత విధులు ముగించుకుని వెళ్లేవారికి ఇది సౌకర్యంగా ఉంటుంది. ఇక మియాపూర్ నుంచి అమీర్పేట వైపు రాత్రి 10.24 గంటలకు చివరి మెట్రో. అమీర్పేటకు చేరుకునే సరికి 10.48 గంటలు అవుతుంది. అమీర్పేట నుంచి రాత్రి 10.49కి చివరి మెట్రో రైలు సర్వీస్ నడుస్తున్నది.
మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్ల వద్ద పార్కింగ్
సదుపాయల వివరాలను ఎల్ అండ్ టీ మెట్రో వెల్లడించింది. స్టేషన్కు ఎటువైపు పార్కింగ్ ఉంది? ఏవైపు లేదు అనే వివరాలు తెలియక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సులువుగా గుర్తించేలా సూచనలు చేసింది. ప్రతి స్టేషన్లోకి ప్రవేశించేందుకు ఎ, బి, సి, డి అని నాలుగు మార్గాలు ఉన్నాయి. ఈ నాలుగింటిలో పార్కింగ్ ‘ఏ' మార్గానికి దగ్గరలో ఉందో సూచించింది. పార్కింగ్ సదుపాయం లేని స్టేషన్లు, ద్విచక్రవాహనాలు మాత్రమే నిలిపే చోటు ఉన్న స్టేషన్లు, కార్లు సైతం పార్కింగ్ చేసే స్థలం ఉన్న వివరాలు పేర్కొంది. నాగోల్ (సీ), ఉప్పల్ సీ అండ్ డీ, సికింద్రాబాద్ ఈస్ట్ (డీ), పరేడ్ గ్రౌండ్స్ (బీ), ప్యారడైజ్ (బీ), రసూల్ పురా (ఎ), బేగంపేట (బీ), ఈఎస్ఐ దవాఖాన, ఎర్రగడ్డ, భరత్ నగర్, మూసాపేట, బాలానగర్, కూకట్ పల్లి, కేపీహెచ్ బీ, జేఎన్టీయూ సీ అండ్ డీ, మియాపూర్ సీ స్టేషన్ల పరిధిలో పార్కింగ్ వసతి అందుబాటులోకి వచ్చింది.
18 స్టేషన్ల పరిధిలోనే రోడ్డుపైనే పార్కింగ్
మియాపూర్ నుంచి అమీర్పేట-నాగోల్ మార్గాల్లో 24 స్టేషన్లు ఉంటే నాలుగుచోట్ల మాత్రమే ఎల్ అండ్టీ సంస్థకు కేటాయించిన స్థలాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. నాగోల్, రసూల్పురా, బాలానగర్, మియాపూర్లో మాత్రమే పార్కింగ్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మెట్రోరైలు సంస్థకు చెందిన మరో రెండు స్థలాలు పరేడ్గ్రౌండ్స్, కూకట్పల్లిలో పార్కింగ్ కల్పించారు. మిగతా 18 స్టేషన్లలోనూ 15 చోట్ల రహదారిపైనే వాహనాలు నిలిపేందుకు ఏర్పాట్లు చేశారు. వీటిలోనూ 5చోట్ల కేవలం ద్విచక్రవాహనాలు నిలిపే స్థలం ఉంది. కొన్నిచోట్ల రెండువైపుల ఉంటే మరికొన్ని చోట్ల ఒకవైపు మాత్రమే అందుబాటులో పార్కింగ్ ఉంది.
పార్కింగ్కు దూరంగా ఎస్సార్ నగర్, ప్రకాశ్ నగర్
అమీర్పేట వద్ద ఇప్పటికీ పార్కింగ్ వసతే లేదు. ఇక్కడ నుంచి నిత్యం 10వేల మందిపై గా ప్రయాణిస్తున్నారు. స్టేషన్ సమీపంలో చాలీస్ మకాన్ స్థలం ఎల్అండ్టీకి కేటాయించారు. ఇక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయాలి. కానీ అమీర్పేట - హైటెక్సిటీ మెట్రో రైలు పనుల సామగ్రి, కార్మికుల నివాసానికి ఈ స్థలం కేటాయించారు. మరోవైపు హెచ్ఎండీఏ స్థలం కార్ల సంస్థకు లీజుకిచ్చారు. గడువు ముగియడంతో అక్కడ పార్కింగ్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమీర్ పేటతోపాటు ఎస్సార్ నగర్, ప్రకాశ్ నగర్ స్టేషన్ల వద్ద వాహనాల పార్కింగ్ లేదు. ఇక ఉప్పల్ స్టేడియం, ఎన్జీఆర్ఐ, హబ్సీగూడ, తార్నాక, మెట్టుగూడ వద్ద ద్విచక్ర వాహనాలకు మాత్రమే పార్కింగ్ వసతి కల్పించారు.