లక్షలు పలికాయి ఇలా..: రూ.10లక్షలకు మధురానగర్ లడ్డూ దక్కించుకున్న నాయుడు
హైదరాబాద్: గణేషుడి లడ్డూలు లక్షలు పలికాయి. ముఖ్యంగా హైదరాబాదులో రికార్డ్ స్థాయిలో ధర పలికాయి. ఎప్పుడూ అందరు ఎదురు చూసే బాలాపూర్ లడ్డూ రూ.14.65 లక్షలకు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. గత ఏడాది బాలాపూర్ లడ్డు రూ.10లక్షల పై చిలుకు పలకగా, ఇప్పుడు నాలుగు లక్షలపై చిలుకు ఎక్కువగా పలికింది.
బాలాపూర్ లడ్డూతో పాటు పలు ప్రాంతాల్లో లడ్డూలు లక్షలు పలికాయి. పదకొండు రోజులు పూజలు అందుకున్న గణనాథుడి లడ్డూ కోసం భక్తులు పోటీ పడ్డారు. లక్షలు పలికి మరీ సొంతం చేసుకున్నారు.
మధురానగర్లో లడ్డూ రు.9.99,999 లక్షలు పలికింది. దీనిని ప్రశాంత్ నాయుడు అనే వ్యక్తి దక్కించుకున్నారు. సరూర్ నగర్ పరిధిలోని బడంగ్పేట లడ్డూ రూ.5.41 లక్షలు, వనస్థలిపురంలోని సాహెబ్ నగర్లోలడ్డు రూ.3.35 లక్షలు, మూసాపేట్ సేవాలాల్ నగర్లో లడ్డు రూ.3.12 లక్షలు, కేపీహెచ్బి కాలనీ మూడో ఫేజ్లో లడ్డు రూ.2.11 లక్షలు పలికింది.
హైదరాబాద్: భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం వర్షం కారణంగా మందకొడిగా సాగినప్పటికీ మధ్యాహ్నానికి ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తి కావడంతో పాటు వర్షం తగ్గడంతో ట్యాంక్బండ్కు భక్తుల తాకిడి పెరిగింది.
నగరం నలుమూలల నుంచి తరలివస్తున్న గణనాథుల వెంట వేలాది మంది భక్తులు ట్యాంక్బండ్కు పోటెత్తుతున్నారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. విగ్రహాల నిమజ్జనం కోసం అధికారులు 23 క్రేన్లు ఏర్పాటుచేశారు.