ఖైరతాబాద్ గణపతికి ఎప్పుడిలా జరగలేదు!
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ వినాయకుడికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఖైరతాబాద్ గణనాథుడితోపాటు ఆయన చేతిలో ఉండే లడ్డూ కూడా ప్రతీ ఏడాది రికార్డులతో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది మాత్రం వినాయక చవితి రోజున బోసిపోయిన చేతి తోనే పూజలందుకున్నాడు గణనాథుడు.
నిరుడు 6 వేల కిలోల భారీ లడ్డూను చేతిలో అమర్చుకున్న ఈ మహా గణపతి.. ఈ సారి మూడో రోజైన బుధవారం వరకు చేతిలో లడ్డూ లేకపోవడంతో భక్తులు కొంత నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో స్థానిక భక్తుడొకరు 11 కిలోల లడ్డూను తయారు చేయించి గణనాథుడి చేతిలో పెట్టించాడు.
తాపేశ్వరానికి చెందిన మల్లిబాబు ఈ సారి కూడా 500 కిలోల లడ్డూను గణపతి కోసం తయారు చేసి తీసుకువచ్చినా.. ఉత్సవ కమిటీ సభ్యుల్లో ఏకాభి ప్రాయం లేకపోవడంతో దాన్ని చేతిలో పెట్ట కుండా పాదాల వద్ద నైవేద్యంగా సమర్పించినట్లు వార్తలు వచ్చాయి.
ఈ లడ్డూతో పాటు ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షుడు మహేష్యాదవ్, మరోదాత 51 కిలోల లడ్డూలను తయారు చేసి సమర్పించినా గణేశుడి చేతిలో పెట్టలేకపోయారు. దీంతో ఖైరతాబాద్కు చెందిన శ్రీధర్ అనే వ్యక్తి 11 కిలోల చిన్న లడ్డూను ప్రత్యేకంగా తయారు చేయించి గణపతి చేతిలో బుధవారం పెట్టించాడు.
లడ్డూను మల్లిబాబు తయారు చేయిస్తున్నట్లు ఉత్సవ కమిటీలోని ముగ్గురికే తెలియడం, మిగితా వారికి తెలియకపోవడం వల్లే వినాయకచవితి రోజున గణపతి ప్రాంగణంలో వివాదం తలెత్తినట్లు తెలిసింది. లడ్డూ ఉండే చేతిని శిల్పి రాజేంద్రన్ 500 కిలోల లడ్డూ పెట్టే విధంగా స్ట్రక్చర్ ఇంజనీర్ల సహాయంతో తయారు చేసినా.. ఉత్సవ కమిటీ సభ్యుల విబేధాలతో లడ్డూను గణపతి చేతిలో పెట్టలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే, గణనాథుడి వద్ద ఉంచిన లడ్డూ ప్రసాదాన్ని 9 రోజులపాటు స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అందించాలనే ఉద్దేశంతోనే నైవేద్యంగా వినాయక పాదాల వద్ద పెట్టినట్లు తెలుస్తోంది.