ఎన్నికల కోసం అప్పులు చేసిన లేడీ సర్పంచ్ ఆత్మహత్య
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా సర్పంచ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలోని కోయిల్కొండ మండలం బూరుగుపల్లి సర్పంచ్ దేవమ్మ మంగళవారం ఉదయం తన పొలంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఈమె ఆత్మహత్యకు ఆర్ధిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. ఎప్పుడూ అందరితో కలగోలుపుగా ఉండే సర్పంచ్ దేవమ్మ ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఎన్నికల కోసం అప్పులు చేయడం వల్లనే ఆమెకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినట్లు చెబుతున్నారు.
సర్పంచ్ ఎన్నికల కోసం దేవమ్మ భారీగా ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. తన వద్ద డబ్బులు లేకపోవడంతో అప్పులు చేసి ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
వివాహిత అనుమానాస్పద మృతి
ఇదిలావుంటే, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. శివరాణి (25) అనే మహిళ ఇంట్లో ఉరేసుకుని ఉండడాన్ని మంగళవారం ఉదయం గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శివరాణి భర్త నాగేశ్వర రావుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.