వేధిస్తున్న యువకుడిని కిడ్నాప్ చేసిన లేడీ టెక్కీ: ఏం జరిగిందంటే?
హైదరాబాద్: ఓ పోకిరీ తనను వేధిస్తుండటంతో ఓ సాఫ్టువేర్ ఉద్యోగిని అతనిని కిడ్నాప్ చేసింది. అతనిని చితకబాదింది. అతనికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. కేసు నమోదు చేసిన పోలీసులు గంటలేపు చేధించారు. ఈ సంఘటన సికింద్రాబాద్లో చోటు చేసుకుంది.
ఫోన్లో వేధిస్తున్నాడని
సమాచారం మేరకు.. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన ఆ లేడీ టెక్కి మాదాపూర్లోని ఓ సాఫ్టువేర్ కంపెనీలో ప్రోగ్రామింగ్ మేనేజర్గా పని చేస్తోంది. ఆమెను బోరబండకు చెందిన యువకుడు గత కొద్ది రోజులుగా ఫోన్లో వేధిస్తున్నాడు. ఈ వేధింపుల నేపథ్యంలో ఆమె చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. తల్లిదండ్రులకు చెప్పకుండా, పోలీసులకు ఫిర్యాదు చేయకుండా తన సమస్యను తాను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకుంది.
స్నేహితులతో కలిసి కిడ్నాప్
ఇందుకోసం తన స్నేహితులతో కలిసి అతని కిడ్నాప్కు స్కెచ్ వేసింది. తీయని మాటలతో అతనిని సికింద్రాబాద్కు రప్పించింది. అక్కడ మిత్రులతో కలిసి అతనిని బలవంతంగా తీసుకు వెళ్లింది. ఓ ఆటోలో కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చితక్కొట్టించింది. అతని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పలు సెక్షన్ల కింద కేసు నమోదు
పోలీసులు అతనిని గుర్తించి, అతని ఫిర్యాదుతో దివ్య, ఆమె స్నేహితులపై కేసు నమోదు చేశారు. గంటలో కేసును ఛేదించారు. కిడ్నాప్ చేసింది టెక్కీ దివ్య అని గుర్తించి, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు సహకరించిన ఐదుగురి కోసం గాలిస్తున్నారు. దివ్య, ఆమె స్నేహితుల పైన కిడ్నాప్, హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని తెలుస్తోంది. అయితే పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.
ఇలా కేసును చేధించారు
ఈ సంఘటన సికింద్రాబాదులో పట్టపగలు కిడ్నాప్ జరిగింది. మోటార్ బైక్ పైన వెళ్తున్న సమయంలో కిడ్నాప్ చేశారు. పట్టపగలు కిడ్నాప్ చేయడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టారు. అనంతరం అతను గాంధీ ఆసుపత్రిలో ఉన్నట్లు గుర్తించి, వివరాలు సేకరించి కేసును చేధించారు. పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ ప్రారంభించారు. అతను గత మూడు నెలలుగా ఆమెను ఫోన్లో బాధిస్తున్నట్లుగా తెలుస్తోంది.