మన ప్రభుత్వం వస్తుందని లగడపాటి చెప్పారు, అతనితో కేటీఆర్ చీకటి స్నేహం: రేవంత్ రెడ్డి
హైదరాబాద్/కొడంగల్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బుధవారం తన నియోజకవర్గమైన కొడంగల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆపద్ధర్మ సీఎం కేసీఆర్, ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ల పైన నిప్పులు చెరిగారు. వీరిద్దరు తెలంగాణ ద్రోహులు అన్నారు. సమైక్యవాది లగడపాటి రాజగోపాల్తో కేటీఆర్ చీకటి స్నేహం బయటపడిందని చెప్పారు.
కేటీఆర్ సందేశాలను లగడపాటి బయటపెట్టారు
లగడపాటినే కేటీఆర్ సందేశాలను బయటపెట్టారని చెప్పారు. సమైక్యవాదితో స్నేహం చేస్తూ తెలంగాణవాదాన్ని బయటకు తీస్తున్నారని, తెలంగాణ సెంటిమెంటును సంపాదనకు ఆయుధంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాయాలన్నారు. నాడు తెలంగాణ సెంటిమెంటును అడ్డం పెట్టుకొని రాజకీయంగా లబ్ధిపొందాడన్నారు.
నన్ను ఎందుకు ఓడించాలి
కేసీఆర్ ఉద్యోగం పోగొడితే వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలిచ్చే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ రెడ్డి చెప్పారు. నిరుద్యోగులకు కేసీఆర్ అన్యాయం చేశారన్నారు. వికారాబాద్ జిల్లాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు డబుల్ రోడ్డు ఇవ్వలేదని నిలదీశారు. బోమరాస్పేట పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్గా చేయాలని కోరితే ఎందుకు చేయలేదన్నారు. తనను ఓడించాలని తెరాస నేతలు అంటున్నారని, నియోజకవర్గంలో అభివృద్ధి చేసినందుకు నన్ను ఓడించాలా అన్నారు.
కేసీఆర్ నల్లత్రాచు
తొమ్మిదేళ్ల క్రితం కొడంగల్ ప్రజలు నాటిన మొక్కను తాను అని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక్కడి ప్రజల ఆశీర్వాదం వల్లే ఈ నియోజకవర్గం అందరికీ తెలిసిందని చెప్పారు. గల్లీలో ఉన్న రేవంత్ రెడ్డిని ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ గుర్తించారన్నారు. కేసీఆర్ నల్లత్రాచు లాంటి వారని, నల్లత్రాచును తొక్కి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
మన ప్రభుత్వం వస్తుందని లగడపాటి చెప్పారు
ఈ 48 గంటలు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఊర్లోకి కొత్తవాళ్లు ఎవరైనా వస్తే పట్టుకోండని చెప్పారు. మహా కూటమే అధికారంలోకి వస్తుందని, తన సర్వేలో తేలినట్లు లగడపాటి చెప్పారని, పది రోజుల్లో మన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రైతులు ఎవరూ బ్యాంకులకు రుణాలు చెల్లించొద్దని, తాకట్టులో ఉన్న పాసు పుస్తకాలన్నీ రైతుల ఇళ్లకు తానే తీసుకొచ్చి ఇస్తానని హామీ ఇచ్చారు.