లగడపాటి జ్యోస్యం..! తెలంగాణలో గులాబీకి తిరుగులేని ఆధిక్యం..!
హైదరాబాద్: ఆంద్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ తెలంగాణ లో మరో సంచలన సర్వే నివేదిక విడుదల చేసారు. తెలంగాణలో మరో సారి టీఆర్ఎస్ కు అధికారం ఖాయమని మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ సర్వే తేల్చి చెప్పింది. అద్భుతమైన మెజార్టీతో కేసీఆర్ కు మరో సారి జనం అవకాశం ఇవ్వోతున్నట్లు సర్వేలో స్పష్టమైంది. కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు దారుణంగా దెబ్బతింటాయని సర్వే లెక్కలు చెపుతున్నాయి. కనీసం ప్రతిపక్షం హోదా కూడా కాంగ్రెస్ కు దక్కే సూచనలు కనిపించడం లేదు. ముందు నుంచి కేసీఆర్ చెపుతున్న స్థాయిలోనే టీఆర్ఎస్ కు సీట్లు వస్తాయని తెలుస్తోంది. నలభై నాలుగు నుంచి నలభై ఎనిమిది శాతం ఓట్లు తెలంగాణ రాష్ట్ర సమితికి దక్కనున్నాయి.
అదికారం గులాబీదే..! తెలంగాణలో ఎదురులేని కేసీఆర్..! తేల్చేసిన ఆంద్ర ఆక్టోపస్..!!
ఏకంగా 90 స్థానాల వరకు గెలుచుకోబోతున్నట్లు లగడపాటి సర్వే చెపుతోంది. టీఆర్ఎస్ కు ఐదు స్థానాలు ఎక్కువ తక్కువ గా 90 నుంచి 95 సీట్ల వరకు రావొచ్చునని సర్వే తేల్చింది.ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా కాకుండా కేసీఆర్ కు ప్రజల నుంచి విపరీతమైన మద్దతు లభిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి గా చంద్రశేఖర్ రావుకు అరవై ఎనిమిది శాతం తెలంగాణ ప్రజల మద్దతు లభించింది. మరో వైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు ముప్పై నుంచి ముప్పై నాలుగు శాతం ఓట్లతో 15 నుంచి 20 సీట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు లగడపాటి తేల్చేశారు. ఈ సంఖ్య ఇంకా తగ్గే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు బీజేపీకి కేవలం ఏడు నుంచి తొమ్మిది శాతం ఓట్లతో 3 నుంచి నాలుగు సీట్లు మాత్రమే వస్తాయని రాజగోపాల్ సర్వే స్పష్టం చేస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీకి ఐదు నుంచి ఆరుశాతం ఓట్లు వస్తాయని సర్వే లెక్కగట్టింది. లెఫ్ట్, కోదండరాం జనసమితి పార్టీలు చెరో 1.5 శాతం నుంచి రెండు శాతం ఓట్లను రాబట్టుకుంటాయని సర్వే చెపుతోంది. ఆ పార్టీలకు మూడు లేదా నాలుగు సీట్లు మాత్రమే వస్తాయని లగడపాటి తేల్చారు.ఇక ఎంఐఎం పార్టీకి ఏడు లేదా ఎనిమిది సీట్లు వస్తాయని ఈ సర్వే చెపుతోంది.
ప్రతిపక్షాలు నామమాత్రమే..! పోటీ ఇవ్వలేవని తేల్చిన లగడపాటి..!!
గత నెల రోజుల వ్యవధిలో లగడపాటి ఈ సర్వే చేయించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో సర్వే చేయించారు.అయినప్పటికి ట్రెండ్ లో పెద్ద తేడా లేదని తేలిందట. అయితే మహాకూటమిగా కాంగ్రెస్, టీడీపీ, లెఫ్ట్, కోదండరాం పార్టీలు ఏర్పడిన తర్వాత సమీకరణాలు కొంత వరకు మారే అవకాశముందని సమాచారం. కాని టీఆర్ఎస్ ప్రభంజనాన్ని తట్టుకొని మహాకూటమి నిలబడే సూచనలు మాత్రం తాజా సర్వే ఆధారంగా కనిపించడం లేదు. మహాకూటమి రెండు మూడు జిల్లాల్లో మినహా మిగిలిన చోట్ల పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చుని తెలుస్తోంది. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ కింగ్ మరో సారి కేసీఆర్ కాబోతున్నాడని లగడపాటి తేల్చి చెప్పారు.
అటు కేంద్రంలో రాహుల్ కి పెరిగిన క్రేజ్..! యువ ప్రధానిగా ఆహ్వానించే ఛాన్స్..!!
మరో వైపు కేంద్ర ప్రభుత్వ తీరుపైన తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపైన కూడా లగడపాటి సర్వే నిర్వహించారు. మోదీ పనితీరు బాగుందని 43 శాతం, బాగా లేదని 57 శాతం మంది అభిప్రాయం పడ్డారు. మొత్తంగా చూస్తే మోదీ పైన తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు అర్థమౌతోంది. ఇక ప్రధాని అభ్యర్థిగా మోదీకి 35 శాతం మంది ఈ సారి మద్దతునిచ్చారు. మరో వైపు తెలంగాణలో రాహుల్ అభ్యర్థిత్వానికి మద్దతు బాగా పెరిగింది. ఆయనకు ఏకంగా 41 శాతం మంది మద్దతు పలకడం విశేషం. ఇదే సమయంలో 23 శాతం ఇతరులు ప్రధాని అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
సర్వేలకు అంత విశ్వసనీయత ఉండదంటున్న ప్రతిపక్షాలు..! లగడపాటి సర్వేను లైట్ తీసుకున్న నాయకులు..!!
షెడ్యూల్ విడుదలైన తర్వాత మరో సారి సర్వే చేయడానికి లగడపాటి టీం సిద్ధమౌతోంది. అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారైన తర్వాతే కచ్చితమైన ఫలితం వస్తుందని ఆయన చెపుతున్నట్లు సమాచారం. ప్రస్తుత సర్వే కేవలం ట్రెండ్ ను మాత్రమే చూపిస్తుందని లగడపాటి అంటున్నారు.గతంలో లగడపాటి నిర్వహించిన అన్ని సర్వేలు అసలు ఫలితానికి అత్యంత దగ్గరగా ఉన్నాయి. దీంతో ఆయన సర్వేలకు విశ్వసనీయత పెరిగింది. ఇటీవల కర్ణాటక ఫలితాలను కూడా లగడపాటి టీం కచ్చితంగా అంచనా వేయగల్గింది. నంద్యాల ఉప ఎన్నికల ఫలితాన్ని మెజార్టీతో సహా ఆయన చెప్పడం విశేషం. ఐతే సర్వేలు ఎప్పుడూ ఒకేలా ఉండవని, ముందస్తుగా నిర్వహించిన సర్వేలను అంతగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నాయి ప్రతిపక్ష పార్టీలు. సర్వేల అంచనాలు తలకిందులైన సందర్బాలు అనేకం ఉన్నియని లగడపాటి సర్వేను కొట్టి పారేస్తున్నారు.