క్రెడిబులిటీ ఎంత: కేసీఆర్ చెప్పినట్లు లగడపాటి సర్వే లంగా సర్వేనేనా..?
తెలంగాణలో కారు జోరు సాగింది. గులాబీ గుభాళించింది. కేసీఆర్కు ఎదురే లేదని తెలంగాణ ప్రజలు మరో సారి నిరూపించారు. గులాబీ పార్టీ మరోసారి సత్తా చాటింది. ఇది సెంటిమెంటుతో ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు. కేసీఆర్ పాలనపై మెచ్చి ఇచ్చిన తీర్పు అని రుజువైంది. ఇక ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే టీఆర్ఎస్ పార్టీ దుమ్ము రేపింది. ఒక్క ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ మాత్రం టీఆర్ఎస్కు ఓటమి పాలవుతుందని చెప్పారు. అయితే లగడపాటి సర్వే లంగా సర్వే అన్న కేసీఆర్ మాటలు నిజమయ్యాయి. ఇక ఎవరెన్ని లెక్కలేసుకున్నా సారూ + కారూ = సర్కారు అన్నది నిజమైంది.
కాంగ్రెస్ తెలుగుదేశం కలయికను జీర్ణించుకోలేని ప్రజలు
తెలంగాణ ఎన్నికలపై జాతీయ సర్వేల అంచనాలకు మించి టీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. లగడపాటి చెప్పినట్లుగా ఇండిపెండెంట్లు చెప్పుకోదగ్గ స్థానాల్లో గెలవలేకపోయారు. ఇక కాంగ్రెస్ 65 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పిన ఆంధ్రా ఆక్టోపస్ పూర్తిగా విఫలమయ్యారు. తెలంగాణ ప్రజలు స్పష్టంగా ఉన్నారు కానీ ... లగడపాటి కన్ఫ్యూజన్లో ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీ పొత్తును ప్రజలు హర్షించలేదని ఈ తీర్పుతో స్పష్టమవుతోంది. టీడీపీ కాంగ్రెస్ క్యాడర్ కూడా టీఆర్ఎస్కే సైలెంట్గా ఓటు వేశారనేది ఈ ఫలితాల ద్వారా తెలుస్తోంది.
లగడపాటి సర్వేకు క్రెడిబులిటీ లేనట్టే...!
పోలింగ్కు రెండు రోజుల ముందు తెలంగాణలో ప్రజాకూటమి గెలుస్తుందని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దీంతో కేటీఆర్ లగడపాటి సర్వే ఒక బూటకమని చెప్పారు. వెంటనే లగడపాటి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రెస్ మీట్ పెట్టి మరీ... మహాకూటమి వస్తుందని జోస్యం చెప్పారు. ఇక పోలింగ్ తర్వాత కూడా తెలంగాణలో ప్రజాకూటమి విజయం సాధించబోతోందంటూ జోస్యం చెప్పారు. అయితే ఓటరునాడిని అంచనా వేయడంలో లగడపాటి దారుణంగా విఫలమయ్యారు. ఆంధ్రా ఆక్టోపస్ది కేవలం చిలక జోస్యం మాత్రమే అని చాలా మంది సోషల్ మీడియా వేదికగా అభివర్ణించారు. ఇక ప్రముఖ జాతీయ ఛానెల్ ఇండియా టుడే సర్వేను కూడా తప్పుబట్టారు లగడపాటి. అయితే కేవలం లగడపాటి సర్వేలపైనే ఆ ఛానెల్ ఓ చర్చ కూడా పెట్టింది.
ఉత్తమ్ మాటలు ఉత్తర కుమార ప్రగల్భాలేనా..?
గజ్వేల్లో ఏకంగా కేసీఆర్కే గడ్డు పరిస్థితి ఉందని చెప్పిన లగడపాటి... సిరిసిల్లాలో కేటీఆర్ గట్టెక్కడం కూడా కష్టమే అన్నారు. లగడపాటి సర్వేలు ఆధారంగా ప్రజాకూటమి నేతలు కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఇక 12వ తేదీ తాను గడ్డం తీసేస్తున్నట్లు... ప్రభుత్వాన్ని కూడా అదే రోజున ఏర్పాటు చేయనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కానీ 11వ తేదీ ఫలితాలు రానే వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి ఘోరంగా చతికిలపడింది. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
కాంగ్రెస్ టీడీపీ క్యాడర్ టీఆర్ఎస్కు సైలెంట్గా ఓటు వేశారా..?
కాంగ్రెస్ విడిగా పోటీ చేసి ఉంటే ఆశించిన స్థాయిలో సీట్లు వచ్చేవన్న అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో వ్యక్తమవుతోంది. తెలుగుదేశంతో జత కట్టడాన్ని ఇటు కాంగ్రెస్ క్యాడర్ కానీ అటు టీడీపీ క్యాడర్ కానీ జీర్ణించుకోలేకపోయాయన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు క్యాడర్తో పాటు సామాన్య ప్రజలు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారనేది ఈ ఫలితాల ద్వారా స్పష్టమవుతోందని చెబుతున్నారు. చంద్రబాబు వస్తే తెలంగాణకు ఎలాంటి నష్టం జరుగుతుందో టీఆర్ఎస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో విజయం సాధించిందని అనలిస్టులు భావిస్తున్నారు. చంద్రబాబు ఎంటర్ కానంత వరకు టీఆర్ఎస్ తమ ప్రచారంలో కేవలం సంక్షేమం గురించే మాట్లాడిందని గుర్తుచేసిన అనలిస్టులు.... చంద్రబాబు ఎంట్రీతో సాధించుకున్న రాష్ట్రానికి నష్టం జరగబోతోందని కేసీఆర్ కేటీఆర్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు.
ఒకవేళ లగడపాటి చెప్పినట్లుగా ప్రజాకూటమిని విజయం వరించి ఉంటే ఇక భవిష్యత్తులో కేవలం లగడపాటి సర్వేకే క్రెడిబులిటీ ఉండేది. ఇప్పుడు అంచనాలు దారుణంగా విఫలమవడంతో కేసీఆర్ అన్నట్లుగా లగడపాటి సర్వే లంగా సర్వేగానే భావించాల్సి ఉంటుందని భవిష్యత్తులో ఆయన సర్వేలను నమ్మే పరిస్థితి లేదని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఇక తెలంగాణ దెబ్బకు రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి ఇప్పుడు ఈ షాక్తో సర్వేల సన్యాసం తీసుకోవడం తథ్యమని టీఆర్ఎస్ చెబుతోంది.