చేప ప్రసాదానికి భారీస్పందన, బత్తిని ఇంట్లో ప్రసాదం పంపిణీ కొనసాగింపు
Recommended Video
హైదరాబాద్: మృగశిరకార్తెను పురస్కరించుకుని బత్తిన హరినాథ్ గౌడ్ నేతృత్వంలో నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దీనిని ప్రారంభించారు. ఉబ్బస వ్యాధిగ్రస్తులకు ఉచిత చేప ప్రసాదం పంపిణీ చేస్తారు.
శనివారం ఉదయం ఇది ముగిసింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిన్న ఉదయం చేప ప్రసాదం పంపిణీ ప్రారంభించామని, ఈ రోజుతో ముగించామన్నారు. 75,361 మందికి చేప ప్రసాదం స్వీకరించారని, దూద్బౌలిలోని బత్తిని హరినాథ్ గౌడ్ ఇంటి వద్ద ఈ ప్రసాదం పంపిణీ కొనసాగుతుందని తెలిపారు.
ఏపీ, తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా అస్తమా వ్యాధిగ్రస్తులు చేప మందు ప్రసాదం స్వీకరించేందుకు వచ్చారని చెప్పారు. ఇదిలా ఉండగా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు, సిబ్బంది, వాలంటీర్లకు మంత్రి తలసాని కృతఙ్ఞతలు తెలిపారు.
రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, జీహెచ్ఎంసీ, సమాచార, పౌర సంబంధాల శాఖ, జలమండలి, అర్అండ్ బీ, విద్యుత్తు, ఆర్టీసీ, వైద్యారోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఎగ్జిబిషన మైదానంలో టెంట్లు ఏర్పాటు చేసి, 3 లక్షల వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. సేవా సంస్థలు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నాయి.