రేవంత్ రెడ్డి వర్సెస్ లక్ష్మారెడ్డి: మంత్రి మున్నాభాయ్ ఎంబిబిఎస్
మహబూబ్నగర్: మున్నాభాయ్ తరహాలో డాక్టర్ పట్టా పొందారంటూ తెలుగుదేశం పార్టీ మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ శాసనసభ్యుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి లక్ష్మారెడ్డి తీవ్రంగా స్పందించారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా మద్దూరు మండల కేంద్రంలో నిర్మించిన ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా వేదికపైనే ఉన్న రేవంత్కు ఆయన సవాల్ విసిరారు.
తాను గుల్బర్గాలో డాక్టర్ డిగ్రీ పట్టా పొందానని, అనుమానం ఉంటే విచారణ చేసుకోవచ్చునని మంత్రి అన్నారు. దాంతో ఆగుకుండా తన పట్టా తప్పని రుజువైతే రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. దీనికి మీరు సిద్ధమా అంటూ రేవంత్ను ప్రశ్నించారు.
ఇది రాజకీయ చర్చా వేదిక కాదని, అధికారిక కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడటం సరి కాదని రేవంత్ రెడ్డి అన్నారు. దీనిపై రాజకీయ వేదికల్లో చర్చించుకుంటే బాగుంటుందని తెలిపారు. ఇతర అంశాలపైనా మంత్రి, ఎమ్మెల్యే మధ్య వేదికపైనే వాగ్వాదం జరిగింది.
తాను వైద్యుడిని కానని, మున్నాభాయ్ తరహాలో పట్టా పొందానని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారని, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని లక్ష్మారెడ్డి అన్నారు. ఆంధ్రా పాలకులకు వత్తాసు పలుకుతూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నవారు ఎంతవరకు చదువుకున్నారో తనకు తెలియదు గానీ తాను మాత్రం కర్ణాటకలో డాక్టర్ పట్టా పొందానని ఆయన చెప్పారు.
తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని మంత్రి లక్ష్మారెడ్డి ఆరోపించడంతో ఆవేశానికి గురైన రేవంత్ రెడ్డి గతంలో చంద్రబాబును ఆశ్రయించి అధికారాన్ని అనుభవించావని అన్నారు. వారిద్దరు తగాదాకు దిగడంతో ఉద్రేకానికి లోనైన తెలుగుదేశం, టిఆర్ఎస్ కార్యకర్తలు వేదికపైకి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకుని అదుపు చేశారు.