జగన్ కేసులో సంచలనం: డిప్యుటేషన్పై తెలంగాణకు లక్ష్మినారాయణ
జగన్ కేసులో సంచలనం సృష్టించిన ఐపిఎస్ అధికారి లక్ష్మినారాయణ హైదరాబాదుకు డిప్యుటేషన్పై రావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు కీలకమైన కేసులను దర్యాప్తు చేసిన ఐపిఎస్ అధికారి లక్ష్మినారాయణ తెలంగాణకు డిప్యుటేషన్పై రావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన శుక్రవారం తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా లక్ష్మినారాయణ డిప్యుటేషన్పై తెలంగాణకు వచ్చే అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగువారైన లక్ష్మీనారాయణ మహారాష్ట్ర క్యాడర్కు ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ఇప్పుడు ఆయన అక్కడే అదనపు డీజీ హోదాలో పనిచేస్తున్నారు.
మధ్యలో కొంతకాలం కేంద్ర సర్వీసులకు వెళ్లి హైదరాబాద్ సీబీఐ విభాగం జేడీగా వచ్చారు. ఆయన హయాంలోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు, కర్ణాటక మాజీ మంత్రి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కుంభకోణం, ఎమ్మార్ ప్రాపర్టీస్ వంటి సంచలనాత్మక కేసులు దర్యాప్తు చేశారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు పలువురు ఐఏఎస్లు, పారిశ్రామికవేత్తలను అరెస్టు చేయడంతో లక్ష్మీనారాయణ పేరు ప్రముఖంగా వెలుగులోకి వచ్చింది. డిప్యుటేషన్ పూర్తికావడంతో ఆయన తిరిగి మహారాష్ట్ర క్యాడర్కు వెళ్లిపోయారు. ప్రస్తుతం లక్ష్మీనారాయణ హైదరాబాద్ రావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలూ అంగీకరిస్తే ఆయన మళ్లీ డిప్యుటేషన్పై ఇక్కడకు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.