సర్పంచ్ ఎన్నికలకే కోట్లు ఖర్చు, పంచాయతీలుగా తండాలు: కేసీఆర్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వాలు అవలంభించిన దుర్మార్గ విధానాల వల్ల గ్రామపంచాయతీలు అస్తవ్యస్తమయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం శాసన సభలో మండిపడ్డారు. తాము ఆ పరిస్థితిని మార్చివేస్తున్నామన్నారు.
రాజకీయాల కోసం గ్రామాలలో చిచ్చు పెట్టారన్నారు. సర్పంచ్ ఎన్నికల కోసమే కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. గ్రామ పంచాయతీలను మురికికూపాలుగా మార్చారన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ప్రత్యక్ష పద్ధతిలోనే పంచాయతీ ఎన్నికలు ఉంటాయన్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్కు ఉమ్మడిగా చెక్ పవర్ ఉంటుందన్నారు. లక్షలమంది ప్రజాప్రతినిధులు పని చేసినా గ్రామాల్లో అభివృద్ధి లేదన్నారు.
హరిత హారాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టామన్నారు. తాము కరెంట్ బాధలు లేకుండా చేశామన్నారు. కొద్ది నెలల్లోనే మంచి నీటి సమస్య పూర్తిగా తీరనుందన్నారు. ప్రాజెక్టులను అడ్డుపడేందుకు కొందరు దుర్మార్గులు కోర్టు మెట్లు ఎక్కారన్నారు. మన మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు అద్వాన్నంగా ఉన్నాయన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 71 ఏళ్లయినా గ్రామ పంచాయతీలు మారలేదన్నారు.
గొప్పగా ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారన్నారు. ఎరువులు కొనాలన్నా రైతులు క్యూ కట్టాలా అని ప్రశ్నించారు. మంచి ఉద్దేశ్యంతో రైతు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశామని చెప్పారు. కేంద్రం పీవోఎస్లు తెచ్చి రైతుల్ని ఇబ్బంది పెడుతోందన్నారు.
తాము పంచాయతీలు, మున్సిపాలిటీలకు రూ.2500 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. తెలంగాణలో ఉన్న 2637 తాండాలను గిరిజనులే పాలించుకుంటారని చెప్పారు. గిరిజనులే సర్పంచులుగా ఉంటారని చెప్పారు. తండాలను పంచాయతీలుగా మార్చే బిల్లును అసెంబ్లీలో బుధవారం ప్రవేశ పెట్టారు. గురువారం దీనిపై చర్చ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు.