సెటిల్మెంట్లకు అడ్డాగా టూరిజం హోటల్ హరిత కాకతీయ .. నిషేధం బ్యానర్లు పెట్టిన అధికారులు
వరంగల్ అర్బన్ జిల్లాలో పర్యాటకుల కోసం ఏర్పాటుచేసిన హరిత కాకతీయ అప్రదిష్టపాలవుతుంది. టూరిజం శాఖ వరంగల్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి వచ్చే పర్యాటకుల వసతి కోసం నిర్మించిన హరిత కాకతీయ హోటల్ ల్యాండ్ సెటిల్మెంట్ లకు , రాజకీయాలకు అడ్డా గా మారుతుంది. పర్యాటకులను ఆకర్షించాల్సిన , ఆహ్లాదాన్ని పంచాల్సిన హరిత హోటల్ లో జరుగుతున్న కార్యకలాపాలు అటు అధికార వర్గాలకు పెద్ద తలనొప్పిగా మారడంతో అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఓరుగల్లు హరిత కాకతీయ .. ల్యాండ్ సెటిల్మెంట్ లకు అడ్డా
వరంగల్ అర్బన్ జిల్లా ... పర్యాటకంగా చాలా ప్రాధాన్యత ఉన్న జిల్లా. కాకతీయుల ఖిల్లా అయిన వరంగల్ లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించడం కోసం నిత్యం పర్యాటకులు వస్తుంటారు. ఇక వారికి వసతి కల్పించడం కోసం టూరిజం శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా హరిత కాకతీయ హోటల్ నిర్మించింది. ఈ హోటల్ నిర్మించిన నాటి నుండి నేటి వరకు ఎక్కువ శాతం రాజకీయ నాయకుల అంతర్గత సమావేశాలకు, ల్యాండ్ సెటిల్మెంట్లకు ఇది వేదికగా మారింది. ఎక్కడ చూసినా గుంపులుగుంపులుగా జనాలు హోటల్ వేదికగా పంచాయతీలు చేస్తుంటే అది పర్యాటకులకు తీవ్ర ఇబ్బంది కరమైన అంశంగా పరిణమించింది.
ల్యాండ్ సెటిల్మెంట్ లకు , ఇతర లావాదేవీలకు ఇది అడ్డా కాదని బ్యానర్లు పెట్టిన అధికారులు
ఇక దీనిపై దృష్టి సారించిన అధికార యంత్రాంగం ఈ హోటల్లో ల్యాండ్ సెటిల్మెంట్లకు, ఇతర లావాదేవీలకు అనుమతులు లేవు. గుంపులుగా హోటల్ లో కూర్చుని గ్రూప్ మీటింగ్ లు పెట్టడాన్ని నిషేధిస్తున్నామంటూ ఏకంగా అక్కడ బ్యానర్ పెట్టింది. ఇక బ్యానర్ పైన రాసిన విషయాన్ని గమనిస్తే జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్ వరంగల్ వారి ఆదేశాల ప్రకారం ఈ హరిత హోటల్ లో ఎలాంటి ల్యాండ్ సెటిల్మెంట్లు కానీ ఇతర లావాదేవీలు కానీ జరపడం నిషేధం. కావున ఈ విషయాన్ని గమనించగలరు అని రాసి ఒక బ్యానర్ పెట్టారు.
పర్యాటకులకు అసౌకర్యం కలిగించవద్దని పేర్కొన్న అధికార యంత్రాంగం
ఇక అందులో ఈ హోటల్ వరంగల్ పర్యటనకు వచ్చే పర్యాటకుల సౌకర్యార్థం ఏర్పాటు చేయబడినది. రెస్టారెంట్ లో కానీ, హోటల్ పరిసరాలలో గానీ ఎటువంటి గ్రూప్ మీటింగ్ లు పెట్టరాదు. ఎవరైనా దీనిని ఉల్లంఘించినట్లు తెలిస్తే తగు చర్యలు తీసుకోబడును. ఇట్లు సుబేదారి పోలీస్ స్టేషన్ హనుమకొండ అంటూ ఏకంగా బ్యానర్ ని పెట్టారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నాడు మంత్రిగా చందూలాల్ ఉన్న సమయం నుండీ అధికార పార్టీ నేతల మీటింగ్ లకు అడ్డా
ముఖ్యంగా హరిత కాకతీయ హోటల్ విషయానికొస్తే ఇక్కడ జరిగే రాజకీయ చర్చలు అధికార పార్టీ నేతల కు సంబంధించినవే ప్రధానంగా జరుగుతాయి. టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ హోటల్లో జిల్లాకు సంబంధించిన మంత్రుల హడావుడి ఎప్పటికి కనిపిస్తుంది. గతంలో టూరిజం శాఖ మంత్రిగా అజ్మీర చందూలాల్ ఉన్న సమయంలో కూడా ఈ హోటల్ ను పలు వ్యక్తిగత అవసరాలకు, పార్టీకి సంబంధించిన కార్యకలాపాలకు ఉపయోగించిన దాఖలాలున్నాయి. ఇక ఆ ఆనవాయితి కొనసాగుతూ వచ్చింది.
హరిత కాకతీయ విషయంలో ఆలస్యంగా మేల్కొన్న అధికార యంత్రాంగం
దీంతో హరిత కాకతీయ హోటల్ ల్యాండ్ సెటిల్మెంట్ లకు, రాజకీయ పార్టీల చర్చలకు, రహస్య సమావేశాలకు వేదికగా మారింది. ఇక ఈ హోటల్ లో జరుగుతున్న సెటిల్మెంట్లు విడిది కోసం వస్తున్న పర్యాటకులకు ఇబ్బందికరంగా పరిణమిస్తున్నాయి. ఇక దీనిపై అధికార యంత్రాంగం చాలా ఆలస్యంగా మేల్కొంది. పర్యాటకులకు ఇబ్బందికరంగా ఇందులో పలు వ్యవహారాలు జరుగుతున్న నేపధ్యంలో అధికార యంత్రాంగం ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తుంది.