ల్యాప్టాప్ల దొంగల ముఠా పట్టివేత (పిక్చర్స్)
హైదరాబాద్: హాస్టళ్లలోని విద్యార్థులు, పోలీసుల కళ్లుగప్పి ల్యాప్టాప్లను దొంగిలిస్తున్న యువకులకు ఎట్టకేలకు హైదరాబాదు పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను సంజీవరెడ్డినగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శుక్రవారం పంజాగుట్ట ఏసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పశ్చిమ మండలం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) వెంకటేశ్వరరావు కేసు వివరాలను వెల్లడించారు.
కంచన్బాగ్ బాబానగర్కు చెందిన మహ్మద్ జావెద్, గుంటూరు జిల్లాకు చెందిన నాగబోతు రాజశేఖర్, తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రాంతానికి చెందిన ఎం.కృష్ణ ముఠాగా ఏర్పడి ల్యాప్ట్యాప్ల చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని అన్నారు. బ్యాచిలర్స్ నివాసం ఉండే గదులు, హాస్టళ్లను టార్గెట్ చేసుకొని మొదట రెక్కీ నిర్వహించి, అక్కడ తమ పనవుతుందన్న నమ్మకం కలిగిన తర్వాతే చాకచక్యంగా ల్యాప్ట్యాప్లను దొంగిలిస్తూ వచ్చారు.
సంజీవరెడ్డినగర్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కన్పించిన నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, పొంతనలేని సమాధానాలు చెప్పారు. చివరకు ల్యాప్ట్యాప్లను చోరీ చేస్తున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి పలు కంపెనీలకు చెందిన ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలావుంటే, గతంలో జావెద్ పది నేరాల్లో నిందితుడు, రాజశేఖర్ నాలుగు కేసుల్లో నిందితుడు. వీరు పలుమార్లు జైలుకు వెళ్లినా కూడా ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాకపోవడంతో మళ్లీ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరిపై పిడి యాక్ట్ పరంగా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు డిసిపి చెప్పారు. సమావేశంలో ఏసిపి వెంకటేశ్వర్లు, డిటెక్టిల్ ఇన్స్పెక్టర్ శంకర్ పాల్గొన్నారు.
హాస్టళ్లలో సిసి కెమెరాలు తప్పనిసరిగా అమర్చుకోవాలని డిసిపి వెంకటేశ్వర్రావు సూచించారు. ఆంధ్రప్రదేశ్ సేఫ్టీ యాక్టు ప్రకారం హాస్టళ్లు, హోటల్స్ తదితర ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పలుసార్లు ఆయా వ్యాపారులకు సూచనలు జారీ చేశామన్నారు.
తమ సూచనలను పట్టించుకోని వారికి నోటీసులు జారీ చేస్తున్నామని, ఇప్పటికే 1500 మందికి నోటీసులు జారీ చేయగా మరో 1500 మంది వ్యాపారులకు తాకీదులు అందజేయనున్నట్లు తెలిపారు. హాస్టళ్ల నిర్వాహకులు వారి వద్ద ఉంటున్న విద్యార్ధులు, ఉద్యోగుల వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.