టీమిండియాకు ధోనీ అవసరం చాలా ఉంది, భారత్ ఫేవరేట్: లారా
హైదరాబాద్: భారత క్రికెట్ జట్టుకు.. వన్డే, ట్వంటీ 20 సారథి మహేంద్ర సింగ్ ధోనీ అవసరం ఎక్కువగా ఉందని వెస్టిండీస్ లెజెండ్ బ్రయాన్ లారా బుధవారం నాడు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగరంలోని హోటల్ తాజ్కృష్ణలో యుప్ టీవీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, బ్రయాన్ లారా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమం అనంతరం.. లారా ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు. 2016 ట్వంటీ 20 ప్రపంచ కప్ ఫేవరేట్ భారత్ అన్నారు.
కాగా, మహేంద్ర సింగ్ ధోనీ ఇటీవల విఫలమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పైన పలువురు విమర్శలు చేస్తున్నారు. ఆయన కెప్టెన్సీ నుంచే కాకుండా జట్టు నుంచి కూడా తప్పుకోవాలనే డిమాండ్లు వినిపించాయి. ఈ సమయంలో ఆయనకు మద్దతు కూడా లభిస్తోంది.
ఈ నేపథ్యంలో లారా వ్యాఖ్యలు గమనార్హం. టీమిండియాకు ధోనీ అవసరం ఎక్కువగా ఉందని చెప్పారు. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న ట్వంటీ 20 సిరీస్ను భారత్ ఇప్పటికే కోల్పోయింది. తొలి వన్డేలో ఓడిపోయింది. ఇప్పుడు రెండో వన్డే జరుగుతోంది.
కాగా, ధోనీని సునీల్ గవాస్కర్ కూడా వెనుకేసుకొచ్చారు. ఓటమికి కేవలం ధోనీనే బలి పశువును చేయడం సరికాదన్నాడు. శిఖర్ ధావన్, సురేష్ రైనా, విరాట్ కోహ్లీ, బిన్నీ వంటి ఆటగాళ్ల ప్రదర్శన పైన ఎవరూ లేవనెత్తడం లేదని, బౌలర్లు కూడా సరైన ప్రదర్శన ఇవ్వడం లేదన్నాడు. ధోనీకి మరో మూడు నుంచి ఐదేళ్లు ఆడే సత్తా ఉందన్నాడు.
విదేశీ ఆటగాళ్లు కూడా ధోనీపై విమర్శలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ధోనీని విమర్శించడం సరికాదని, ధోనీ గొప్ప ఆటగాడని, నాయకుడు అని, అంతకంటే గొప్ప వ్యక్తి అని కితాబిస్తున్నారు. ప్రత్యర్థులుగా మాకూ అతడి పైన ఎంతో గౌరవం ఉందంటున్నారు.