చివరి నిమిషంలో కేసీఆర్ కీలక నిర్ణయం: ఆ ఇద్దరూ రాజ్యసభకు: సురేష్ రెడ్డి..దేశపతికి ఎమ్మెల్సీ..!
తెలంగాణ నుండి ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ నుండి పోటీ ఎక్కువగా ఉంది. రెండు స్థానాలు టీఆర్ఎస్ కే దక్కనున్నాయి. దీంతో..రెండు రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పేర్ల ఖరారు పైన ఫోకస్ చేశారు. అనేక చర్చలు చేశారు.. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Recommended Video
కవితను రాజ్యసభకు పంపితే విమర్శలు
ఇప్పటికే అందుతున్న సమాచారం మేరకు తొలుత కవితతో పాటుగా కేకే లేదా పొంగులేటి శ్రీనివాస రెడ్డి ...జూపల్లి రామేశ్వరరావు పేర్ల పైన చర్చ సాగింది. అయితే, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిన కవితను పెద్దల సభకు పంపితే విమర్శలు వచ్చే అవకాశం ఉందనే వాదనతో ఆ ఆలోచన విరమించుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో..రెండు రాజ్యసభ స్థానాలతో పాటుగా భర్తీ చేయాల్సిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం.
పెద్దల సభకు ఆ ఇద్దరికి ఛాన్స్..
తెలంగాణ కోటాలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత..ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసినట్లు సమాచారం. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె. కేశవరావు మరోమారు రాజ్యసభకు వెళ్లటం ఖాయంగా కనిపిస్తోంది. రెండో స్థానానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. పార్టీ తరఫున పలువురు నేతలు రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశించినా చివరకు ఈ ఇద్దరు నేతల వైపే కేసీఆర్ మొగ్గుచూపినట్లు తెలిసింది.
మరోసారి తనకు అవకాశమివ్వాలంటూ కేకే అభ్యర్థన
నిజామాబాద్ మాజీ ఎంపీలు కవిత, ప్రొఫెసర్ సీతారాం నాయక్, మందా జగన్నాథం రాజ్యసభ ఆభ్యర్థిత్వాన్ని ఆశించిన వారి జాబితాలో ఉన్నారు. వారితోపాటు దామోదర్రావు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, హెటిరో సంస్థల అధినేత పార్థసారథిరెడ్డి పేర్లను కూడా సీఎం పరిశీలించినట్లు తెలిసింది. అయితే, మున్నూరు కాపు వర్గానికి చెందిన కే కేశవరావు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిని కలిసి తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్ధించారు. అదే విధంగా..లోక్ సభ ఎన్నికల సమయంలో ఖమ్మం లోక్ సభ సీటును నామా నాగేశ్వరరావుకు కేటాయిస్తూ..పొంగులేటికి రాజ్యసభ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో..ఇప్పుడు ఈ ఇద్దరి పేర్లు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.
మండలికి ఆ ఇద్దరు ఖరారు..
వివిధ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని కేకే, పొంగులేటి అభ్యర్థిత్వం వైపు కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలిసింది. అయితే అభ్యర్థిత్వం ఖరారైనట్లుగా ప్రచారంలో ఉన్న నేతలు మాత్రం తమకు పార్టీ నుంచి సమాచారం అందలేదని మంగళవారం రాత్రి ధ్రువీకరించారు. ఈ నెల 13న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నామినేషన్కు తుది గడువు ఉండటంతో రాజ్యసభ అభ్యర్థుల పేర్లను బుధవారం ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు శాసనమండలి నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా అభ్యర్థిగా అసెంబ్లీ మాజీ స్పీకర్ సురేశ్రెడ్డి, గవర్నర్ కోటా అభ్యర్థిగా సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ పేర్లను సైతం సీఎం ఖరారు చేసినట్లు సమాచారం. ఈ నెల 12న మండలి నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా స్థానానికి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ మధ్నాహ్నం లోగానే అటు రాజ్యసభ..ఇటు శాసన మండలి అభ్యర్ధుల పేర్లను టీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించనుంది.