తాజా సమీకరణాలు..! ప్రాభల్యం కోల్పోయిన గులాబీ పార్టీ..!!
హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో ఓట్లు రాబట్టడంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెనకబడ్డారు. మంత్రుల నియోజకవర్గాలు మినహాయిస్తే టీఆర్ఎస్ కు చెందిన 76 మంది ఎమ్మెల్యేల్లో 30 మంది సెగ్మెంట్లలో తక్కువ ఓట్లు వచ్చాయి. కొన్ని సెగ్మెంట్లలో 30 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీని టీఆర్ఎస్ కోల్పోయింది. ఆర్మూరులో 32 వేలు, కరీంనగర్ లో 52 వేలు, చొప్పదండిలో 56 వేలు, మానకొండూరులో 35 వేలు, ఖానాపూర్లో 32 వేలు, ముథోల్లో 32 వేలు, అంబర్పేటలో 46 వేల మెజారిటీని చేజార్చుకుంది. బీజేపీ అభ్యర్థి గెలిచిన నియోజకవర్గాలోనే ఈ పరిస్థితి రావడం గమనార్హం. ఇక కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన 11 మందిలో ముగ్గురు ఎమ్మెల్యేలకు వారి సెగ్మెంట్లలో టీఆర్ఎస్ అభ్యర్థికి తక్కువ ఓట్లు వచ్చాయి. ఇతర పార్టీల నుంచి గెలిచిన 8మందిని తీసేస్తే.. టీఆర్ఎస్కు వచ్చిన మెజారిటీ 63 సీట్లలో మాత్రమే.
30 నియోజకవర్గాల్లో ప్రభావం తగ్గిన కారు..!లోక్సభ ఎన్నికల్లో భారీగా తగ్గిన ఓట్లు, మెజారిటీలు..!!
అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో టీఆర్ఎస్కు వచ్చిన మెజారిటీ 89,009. తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో కారుకు ఆ సెగ్మెంట్లో వచ్చిన మెజారిటీ కేవలం 5,713 ఓట్లు మాత్రమే! అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఒక్క ఖమ్మం సీటునే టీఆర్ఎస్ గెలుచుకుంది. ఇప్పుడు జరిగిన లోక్సభ ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కారు దూసుకుపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క గోషామహల్లో మాత్రమే గెలిచింది. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఏకంగా 21 అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజారిటీ వచ్చింది. నల్లగొండ లోక్సభ పరిధిలో నాడు ఒక్క హుజూర్నగర్లో మాత్రమే గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు ఐదు సెగ్మెంట్లలో మెజారిటీ సాధించింది.
కాంగ్రె్సకు అదనంగా 2..! బీజేపీకి 20చోట్ల మెజారిటీ..!!
అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే నాలుగు నెలల్లోనే టీఆర్ఎస్ ప్రాభవం కొంత తగ్గింది! ఆ మేరకు బీజేపీ పట్టు పెరిగింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా స్వల్పంగా మెరుగుపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో 88 నియోజక వర్గాల్లో గులాబీ గుభాళిస్తే.. లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి కేవలం 71 సెగ్మెంట్లలోనే ఆ పార్టీకి మెజారిటీ వచ్చింది. అంతేనా.. గత ఎన్నికల్లో గెలిచిన 34 సెగ్మెంట్లలో ఇప్పుడు టీఆర్ఎ్సకు ఆధిక్యం పడిపోయింది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీలు పైచేయి సాధించాయి. ఖానాపూర్, నిర్మల్ సెగ్మెంట్లలో ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది. అదే సమయంలో, గత ఎన్నికల్లో ఇతర పార్టీలు గెలిచిన 17 సెగ్మెంట్లలో టీఆర్ఎస్ కొత్తగా మెజారిటీ సాధించింది. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 19 స్థానాలను గెలుచుకుంటే.. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి 21 చోట్ల మెజారిటీ వచ్చింది. అప్పటికీ, ఇప్పటికీ భారీగా లబ్ధి పొందింది మాత్రం బీజేపీనే. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సెగ్మెంట్నే గెలుచుకుంది. లోక్సభకు వచ్చేసరికి ఆ పార్టీకి 21 సెగ్మెంట్లలో మెజారిటీ వచ్చింది.
అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లలో గెలుపు..! ఇప్పుడు వాటిలో 34 చోట్ల వెనుకంజ..!!
ఇక లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచిన నాలుగు నియోజక వర్గాల్లోనే ఆ పార్టీకి ఓట్ల శాతం పెరిగింది. మిగిలినచోట్ల ఆ పార్టీ పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. తద్వారా, లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓట్లు కొన్నిచోట్ల కాంగ్రె్సకు.. అత్యధిక సెగ్మెంట్లలో బీజేపీకి మళ్లాయి. అంతేనా.. స్వయంగా హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట సహా అనేక అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ మెజారిటీలు భారీగా పడిపోయాయి. కానీ, సీఎం చంద్రశేఖర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో మాత్రం అప్పట్లో 58,290 ఓట్ల మెజారిటీ వస్తే.. ఇప్పుడు ఇది 84,187 ఓట్లకు పెరగడం విశేషం. అయితే, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే, లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి పోలింగ్ శాతం గణనీయంగా తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల్లో 73.2 శాతం పోలింగ్ జరిగితే.. లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ 62.69 శాతం మాత్రమే! రాష్ట్రవ్యాప్తంగా 10.51 శాతం తగ్గితే.. కొన్ని నియోజక వర్గాల్లో అంతకంటే ఎక్కువే తగ్గింది. మెజారిటీలు తగ్గడానికి ఇది కూడా ఒక కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. రెండు ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఐదుగురు మంత్రుల వెనుకబాటు..! ఖమ్మంలో భారీగా పుంజుకున్న టీఆర్ఎస్..!!
వాళ్లు రాష్ట్ర మంత్రులు. రచ్చ కూడా గెలవాల్సిన వారు ఇంట్లో ఓడిపోయారు. లోక్సభ ఎన్నికల్లో తమ సొంత అసెంబ్లీ సెగ్మెంట్లలో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ వెనకబడ్డారు. వీరిలో అలీ ఎమ్మెల్సీ కాగా, మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలు. ఇంద్రకరణ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్లో బీజేపీ ఎక్కువ ఓట్లు సాధించగా.. కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. టీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోయింది. మంత్రి తలసాని సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన తన తనయుడు సాయికిరణ్ను గెలిపించుకోలేకపోవటం అటుంచి, ఆ స్థానం పరిధిలోకి వచ్చే.. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సనత్నగర్లోనూ మెజారిటీ తెచ్చుకోలేకపోయారు. ఇక్కడ టీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ కు 30,651 మెజారిటీ రాగా.. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 14,836 ఓట్లతో పైచేయి సాధించింది. మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ; శ్రీనివాసగౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్నగర్ల్లోనూ బీజేపీ మెజారిటీ సాధించింది.