రేవంత్ ఓటుకు నోటు: న్యాయశాఖకి ఫిర్యాదు, తెలంగాణ ఉద్యోగులకి జీతాలపై ఏపీ సవాల్!
హైదరాబాద్: తెలంగాణ అదనపు అడ్వోకేట్ జనరల్ (ఏఏజీ) రామచంద్ర రావు పైన న్యాయవాది కరుణాకర్ రెడ్డి కేంద్ర న్యాయశాఖకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువనేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా రామచంద్ర రావు వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. దీనిపై కేంద్ర న్యాయశాఖ స్పందించాలని కోరారని తెలుస్తోంది.
కాగా, ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టై... ఆ తర్వాత బెయిల్ పైన విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం రేవంత్ రెడ్డి బెయిల్ను సవాల్ చేస్తూ తెలంగాణ ఏసీబీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
అయితే, బెయిల్ను రద్దు చేయడం కుదరదని సుప్రీం కోర్టు చెప్పింది. ఆ సమయంలో రామచంద్ర రావు మాట్లాడుతూ... ఉమ్మడి హైకోర్టులో నిష్పాక్షిక నిర్ణయాలు జరగడంలేదని, ప్రత్యేక కోర్టు ఉంటేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు.
విద్యుత్ ఉద్యోగుల జీతాలపై కోర్టుకు ఏపీ
ఆంధ్రప్రదేశ్ స్థానికతగా ఉండి, తెలంగాణ విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు కోర్టులో మంగళవారం ఊరట లభించింది. వీరికి ఇవ్వాల్సిన బకాయిల్లో 58 శాతం ఏపీ, 42 శాతం తెలంగాణ చెల్లించాలని న్యాయస్థానం సూచించింది.
ఈ తీర్పును సవాల్ చేయాలని చంద్రబాబు సర్కారు భావిస్తోంది. అసలు తమ ఉద్యోగులు కానివారికి తామెలా వేతనాలు చెల్లిస్తామని ఏపీ విద్యుత్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 58 శాతం వేతనాలు ఇవ్వాలంటే, తమపై రూ.29 కోట్ల భారం పడుతుందని ట్రాన్స్ కో సీఎండీ విజయానంద్ అన్నారు.
ఏపీ స్థానికత కలిగిన తెలంగాణ ఉద్యోగులు 1,200 మందికి పైగా ఉన్నారు. వారిని కొద్ది నెలల క్రితం తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. వీరికి రూ. 40 కోట్ల మేరకు వేతనాలు రావాల్సి ఉంది. ఈ విషయంలో ఏం చేయాలన్న విషయమై న్యాయ నిపుణుల సలహాలు తీసుకోనున్నట్టు విజయానంద్ పేర్కొన్నారు.