ఓ సన్నాసి ధర్నా చేస్తుంటే మరో సన్నాసి మద్దతా?: లక్ష్మారెడ్డి ఘాటు వ్యాఖ్యలు
మహబూబ్నగర్: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్డీఎస్ వద్ద ఓ సన్నాసి ధర్నా చేస్తుంటే మరో సన్నాసి మద్దతివ్వడానికి వెళ్ళాడని లక్ష్మారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మహబూబ్నగర్లో ఎమ్మెల్యే వి.శ్రీనివా్సగౌడ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి రాయణరెడ్డిలతో కలిసి సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్డీఎస్ ఆధునికీకరణపై అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ నాయకత్వంలో కాంగ్రెస్ ధర్నా చేస్తుంటే, టీడీపీ నేత రేవంత్రెడ్డి మద్దతు తెలపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీల దద్దమ్మల కారణంగానే పాలమూరుకు వెనకబడిన జిల్లాగా పేరొచ్చిందని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి మాట వరసకు కుర్చీ వేసుకుని పనులు చేయిస్తానంటే, కాంగ్రెస్ సన్నాసులు ధర్నా వద్ద వ్యంగ్యంగా కుర్చీ వేసి సీఎంపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలో కుర్చీ వేసుకుని కూర్చుని చేసే కన్నా ఎక్కువ పనులే జరుగుతున్నాయని గుర్తు చేశారు. బద్ద శుత్రువులైన కాంగ్రెస్, టీడీపీ నాయకులు కలిసి ధర్నా చేస్తుంటే ప్రజలు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ.. ఆర్డీఎస్ ధర్నాలో కాంగ్రెస్, టీడీపీ నాయకులు సీఎంపై వ్యక్తిగత ధూషణలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రానికి నిధులివ్వకుండా, విభజన చట్టాన్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు.
పాలమూరు ప్రాజెక్ట్ను అడ్డుకునేందుకు రైతులతో సుప్రీంకోర్టులో కేసులు వేయిస్తున్న చంద్రబాబు వద్ద ధర్నాలు చేయాలన్నారు. నల్గొండలో ఉన్న పరిస్థితి ఏంటో ధర్నాకు వచ్చిన కాంగ్రెస్ పెద్దలు, ఆ జిల్లా నాయకులైన ఉత్తమ్కుమార్రెడ్డి, జానారెడ్డిలకు తెలియదా? అని ప్రశ్నించారు. జిల్లాకు డిండీ ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళుందించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు.