బాబు లేఖ ఇస్తే: మంత్రి లక్ష్మారెడ్డి ట్విస్ట్, అప్పు అడగలేదు: ఈటెల
మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్ర మంత్రి లక్ష్మా రెడ్డి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పైన కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో లేఖ ఇప్పిస్తే నాలుగేళ్లలోనే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన మహబూబ్ నగర్ జిల్లాలో చెప్పారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు... పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణంతో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చంద్రబాబుతో కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇప్పించాలని, అప్పుడు తాము నాలుగేళ్లలో దానిని నిర్మించి చూపిస్తామన్నారు.
పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నాలుగేళ్లలో పూర్తి చేస్తే తెలుగుదేశం పార్టీని వదిలి పెడతామంటున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు మరోవైపు ప్రాజెక్టు అనుమతులకు అడ్డుపడేలా చంద్రబాబుతో, టిడిపి నేత సీఎం రమేష్తో కేంద్రానికి లేఖలు ఇప్పిస్తున్నారని ఆరోపించారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రాజెక్టును పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉన్నారని చెప్పారు. ఆయన పట్టుదలతో ఉన్నారన్నారు.
మాకు లోటు లేదు: ఈటెల
తెలంగాణ ఆదాయం పెరుగుతోందని, ఇప్పటి వరకు దేశంలో గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలు మాత్రమే ఆర్బీఐని అప్పు అడగని రాష్ట్రాలని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మంత్రి బుధవారం సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆరోగ్య కరంగా ఉందని, ఆదాయం బాగుందని, బడ్జెట్లో కేటాయించిన విధంగా ఆయా శాఖలకు నిధులు వ్యయం చేస్తున్నట్టు తెలిపారు.