కేటీఆర్ వ్యాఖ్యలపై సవాల్ విసిరిన బీజేపీ...!
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతుందని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్పందించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని లక్ష్మణ్ చెప్పారు. మంత్రి చేసిన వ్యాఖ్యలపై తాము చర్చకు సిద్దమని లక్ష్మణ్ సవాల్ విసిరారు. టీఆర్ఎఎస్ కేంద్రంలో ఒకలా, హైదారాబాద్లో మరోలా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు.
కేటీఆర్ వ్యాఖ్యలు వాస్తవం కాదు
ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన లక్ష్మణ్, అవి వాస్తవం కాదని అన్నారు. వేర్పాటు వాదాన్ని రెచ్చగొట్టేలా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంతో ఎదిగిన పార్టీ ఇప్పుడు రాష్ట్ర అస్తిత్వాన్నే ఫణంగా పెడుతుందని ఆయన విమర్శించారు. ఈనేపథ్యంలోనే రక్షణ శాఖ భూములను కొనాలన్న టీఆర్ఎస్ వ్యూహం ఫెయిలందని అందుకే కేంద్రంపై ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు.
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష
బుధవారం మాదాపూర్లోని శిల్పాకళావేదికలో నిర్వహించిన టీఎస్ ఐపాస్ వార్షికోత్సవాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ కేంద్రప్రభుత్వ విధానాలపై ఫైర్ అయ్యారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర వైఖరిపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ భారత రాష్ట్రాలపై కేంద్రం వైఖరి మారాలని ఆయన కోరారు. బుల్లెట్ రైలు అంటే ఢిల్లీ, ముంబయి రాష్ట్రాలే గుర్తుకు వస్తాయా... హైదరాబాద్ గుర్తుకు రాదా అంటూ ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. మరోవైపు రక్షణశాఖ భూములకు సంబంధించి తాత్సారం చేస్తుందని విమర్శలు చేశారు.
రాజకీయా కారణాలతోనే రాష్ట్రంపై వివక్ష
ఇక అభివృద్ది ఫథంలో దూసుకుపోతున్న రాష్ట్రాలను కేంద్రం పట్టించుకోవడం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాజకీయ కారణాలతో తెలంగాణ అభివృద్దిని పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్దికి కృషి చేస్తున్న రాష్ట్రాలను ప్రోత్సహిస్తే... ఆయా రాష్ట్రాలు మరింత అభివృద్దిని సాధిస్తాయని ఆయన సూచించారు. అయితే కేంద్రం తీరు మాత్రం ఇందుకు విరుద్దంగా ఉందని దుయ్యబట్టారు.