బార్ పడావో.. బార్ బచావో.. ఇదీ కేసీఆర్ ప్రభుత్వ విధానం, బీజేపీ లక్ష్మణ్ ఫైర్
సీఎం కేసీఆర్పై తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మద్యాన్ని కేసీఆర్ ఆదాయ వనరుగా చూడటంతో సమస్య వచ్చిందన్నారు. కొందరు టీనేజర్లు మద్యం సేవించి రెచ్చిపోతున్నారని చెప్పారు. పొరుగు రాష్ట్ర సీఎం జగన్ మద్యంపై తీసుకొచ్చిన విధానాలను అమలు చేయాలని సూచించారు.
రాష్ట్రంలో జరుగుతున్న లైంగికదాడులకు కారణం విచ్చలవిడిగా మద్యం విక్రయించడమేనని లక్ష్మణ్ అన్నారు. మద్యం విక్రయాల కోసం తలుపులు బార్లా తెరిచారని పేర్కొన్నారు. దీంతో బంగారు తెలంగాణగా మారుస్తానన్న రాష్ట్రం కాస్త తాగుబోతుల స్టేట్గా చేశారని ధ్వజమెత్తారు. మద్యాన్ని కేవలం ఆదాయ వనరుగా మాత్రమే కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. మద్యంపై ఆదాయం రూ.10 వేల కోట్ల నుంచి 21 వేలకు పెరగడం దీనికి సాక్ష్యం అని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీ భేటీ పడావో, బేటీ బచావో అంటున్నారని లక్ష్మణ్ గుర్తుచేశారు. మహిళల రక్షణకు ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పారు. కానీ కేసీఆర్ మాత్రం బార్ పడావో.. బార్ బచావో అన్నట్టు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. దీంతో రాష్ట్రంలో మైనర్లు కూడా మద్యం సేవించేందుకు దోహదపడిందని చెప్పారు. పొరుగురాష్ట్రం ఏపీలో జగన్ మద్యం పాలసీ బాగుందన్నారు. సమయం తగ్గించడం, బెల్ట్ షాపులను ఎత్తేయడం మంచి పరిణామమని పేర్కొన్నారు.
నవంబర్ 28వ తేదీన దిశ అనే వెటర్నరీ వైద్యురాలిపై లైంగికదాడి చేసి హతమార్చిన ముగ్గురు నిందితులు 20 ఏళ్ల లోపే వారు కావడం విశేషం. జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు వయస్సు 20 ఏళ్లే. వాస్తవానికి వీరు మద్యం కొనుగోలు చేయరాదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం షాపులో 21 ఏళ్ల లోపు వారికి విక్రయించకూడదు కూడా.
కానీ ఆ రోజు ఏం జరిగింది, ఎవరు మద్యం తీసుకొచ్చారనే అంశంపై స్పష్టత లేదు. దిశ హత్య కేసులో ఏ1 నిందితుడు మహ్మద్ ఆరిఫ్ ఒక్కడే 26 ఏళ్లు.. మిగతా వాళ్లంతా చిన్నవారే కావడంతో.. మద్యం వల్లే దారుణాలు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.