ఆంధ్రాకు కేసీఆర్ వరాలపై లక్ష్మణ్ ఫైర్
హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై ఓ రేంజ్లో ఫైరయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. తెలంగాణలో సరిగా వర్షాలు లేక ఉంటే .. ఆంధ్రాకెళ్లి వరాలు కురిపిస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తీరు కన్నతల్లికి అన్నం పెట్టలేని వాడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నట్టుగా ఉందని విమర్శించారు. కేసీఆర్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని సీఎం అని ఇప్పటికే ముద్రపడిందన్నారు.
రాయలసీమను రతనాల సీమ చేస్తానని కేసీఆర్ మాట్లాడటంపై భగ్గుమన్నారు. తెలంగాణ కరవుతో అల్లాడుతుంటే .. పక్క రాష్ట్రంపై ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీకి ప్రజల మద్దతు లభిస్తోంనద్నారు. ఊహించిన దాని కన్నా ఎక్కువ సభ్యత్వ నమోదు లభించడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో తిరగులేని శక్తిగా బీజేపీ అవతరిస్తోందన్నారు. తమ పార్టీ ఎదుగుదలను జీర్ణించుకోలేక కొందరు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు నత్తనడకన సాగుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత ఉందన్నారు. మందులు వేలని .. ఆరోగ్య పరిస్థితిపై మంత్రులు కూడా సమీక్షించడం లేదని విమర్శించారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలలను ఎండగట్టడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపాల్సింది పోయి .. టీఆర్ఎస్ సర్కార్ విస్మరించిందని మండిపడ్డారు. దీనిపై టీఆర్ఎస్ పార్టీకి బుద్దిచెప్తామన్నారు.