ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా ఇవ్వటం ఫై కీలక వ్యాఖ్యలు చేసిన లక్ష్మణ్ .. ఆ పని చేస్తే ప్రజాస్వామ్యం ఖూనీ
తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎల్పీ ని టీఆర్ఎస్ లో విలీనం చేయడం సరి కాదని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని లొసుగులను అడ్డం పెట్టుకొని టిఆర్ఎస్ పార్టీ తప్పు చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఎంఐఎం కు ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
మిత్ర పక్షంగా ఉన్న పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించిన బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ లక్ష్మణ్
తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ,లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తో కలిసి మిత్రపక్షంగా పోటీ చేసిన ఎంఐఎంకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ పార్టీ తప్పు చేస్తుందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ నేనని, వచ్చే ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి టిఆర్ఎస్ కు బుద్ధిచెప్పే సరైన పార్టీగా మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
సీఎల్పీ ని విలీనం చేసి టిఆర్ఎస్ పార్టీ తప్పు చేసిందని పేర్కొన్న లక్ష్మణ్ ఫిరాయింపు చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని సీఎం కేసీఆర్ ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు.
వచ్చే ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యం అన్న లక్ష్మణ్
ఇక దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాటక తర్వాత బీజేపీకి అనుకూలంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని, అందుకే బిజెపి అధినాయకత్వం తెలంగాణపై దృష్టి సారించిందని పేర్కొన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా సిద్ధంగా ఉందని లక్ష్మణ్ అన్నారు. మోడీ అండదండలు తెలంగాణ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
ఇక తెలంగాణలో అధికార పార్టీ వైఫల్యాలను తెలియజేసి, వారి కుటుంబ పాలనకు చరమగీతం పాడే లా ప్రజా క్షేత్రంలో ఎండగడతామని పేర్కొన్న లక్ష్మణ్ కెసిఆర్ ప్రజా వ్యతిరేక పాలన పై ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు వెళ్దామని ఆయన పేర్కొన్నారు.
Recommended Video
ఫిరాయింపు రాజకీయాల్లో టీఆర్ఎస్ ది నెంబర్ వన్ స్థానం అంటూ లక్ష్మణ్ మండిపాటు
ఫిరాయింపు రాజకీయాల్లో టీఆర్ఎస్ ది నెంబర్ వన్ స్థానం అని చెప్పిన లక్ష్మణ్ సీఎం కెసిఆర్ ప్రజలకు చేసిన వాగ్దానాలను మరిచిపోయారని మండిపడ్డారు. ఇక విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించి సీఎం కేసీఆర్ చోద్యం చూస్తున్నారన్నారు . కళాశాలలు, పాఠశాలల ఫీజుల నియంత్రణ పై ఏ విధమైన నిర్ణయం తీసుకోకుండా టిఆర్ఎస్ సర్కా ర్ మీనమేషాలు లెక్కిస్తూ ఉందని లక్ష్మణ్ పేర్కొన్నారు. పరీక్షలు ఏమి జరిగినా అవకతవకలేనని అంతా గందరగోళమేనని ఆయన విమర్శించారు. ఏది ఏమైనప్పటికీ ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా ఇవ్వడాన్ని బిజెపి మాత్రం అసలు అంగీకరించే పరిస్థితిలో లేదు.