బీజేపీలోకి ఆర్ కృష్ణయ్య?: లక్ష్మణ్ ఏమన్నారంటే..?
హైదరాబాద్: తెలంగాణలో నిజమైన మార్పు బీజేపీతోనే సాధ్యమని ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీల విన్యాసాలు, డ్రామాలు చూసి జనం నవ్వుకుంటున్నారని విమర్శించారు.
130 ఏళ్ల చరిత్ర, బలమైన పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్... ఇప్పుడు బలహీన పార్టీలతో పొత్తులు ఎందుకు పెట్టుకుంటుందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్కు ఓటేస్తే మూసీలో వేసినట్లేనని అన్నారు. తెలంగాణలో ఓట్లు అడిగే అర్హతను కాంగ్రెస్ పోగొట్టుకుందన్నారు.
టీఆర్ఎస్, ఎంఐఎం మైత్రిని ప్రజలు విశ్వసించే స్థితిలో లేరని, కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలేనని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. అక్టోబర్ మొదటి వారంలో తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తున్నామని తెలిపారు. అదే నెలలో అమిత్ షాతో కరీంనగర్, వరంగల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పారు.
కాగా, టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు నాయకుడు ఆర్ కృష్ణయ్యకు బీజేపీ స్వాగతం పలుకుతోందని లక్ష్మణ్ అన్నారు. ఆర్.కృష్ణయ్య పార్టీలోకి వస్తానంటే ఎంపీ టికెట్ ఇవ్వడానికైనా సిద్దమేనని వెల్లడించారు.
టీజేఎస్, తెలంగాణ ఇంటిపార్టీల నేతలు బీజేపీలో చేరేందుకు ఊగిసలాడుతున్నారని అన్నారు. ఇంటి పార్టీ నేతలు యెన్నం శ్రీనివాస్తో సహా పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామనీ, షరతులు లేని చేరికలు ఉంటాయని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా యువ సమ్మేళనాలు నిర్వహిస్తామన్నారు.
Recommended Video